స్కాట్లాండ్ క్రికెట్లో ఆదివారం అనుకోని అలజడి రేగింది. జాత్యహంకార (రేసిజం) ఆరోపణలతో స్కాట్లాండ్ క్రికెట్ బోర్డులోని ఏకంగా ఆరుగురు సభ్యులు మూకుమ్మడిగా తమ రాజీనామాలు సమర్పించారు. జట్టులోని నల్లజాతీయులైన క్రికెటర్లపై వీళ్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారని జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లు ఆరోపించడంతో ఆదివారం బోర్డులోని ఆరుగురు రాజీనామా చేశారు.
స్కాట్లాండ్ క్రికెట్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్న మజీద్ హక్తో పాటు మాజీ క్రికెటర్ ఖాసీం షేక్లు ఇటీవల ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బోర్డులోని పలువురు సభ్యులు తమపై జాత్యహంకార కామెంట్లు చేశారని ఆరోపించారు. తమ శరీరం, రంగు వేరు కావడంతో మిగతా జట్టు సభ్యులతో తమను వేరుగా చూసేవారని కామెంట్స్ చేశారు. వీళ్లు చేసిన ఆరోపణలపై స్కాట్లాండ్ ప్రభుత్వం ఓ కమిటీని నియమించి విచారణ చేపట్టింది.
ఈ కమిటీ ఆరోపణలు వచ్చిన సభ్యులను విచారించగా నిజం నిగ్గు తేలింది. బోర్డు డైరెక్టర్లు తాము తప్పు చేసినట్టు ఒప్పుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక జులై 25 (సోమవారం) విడుదల కావాల్సి ఉండగా.. ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆరుగురు సభ్యులు ఆదివారమే తమ రాజీనామా లేఖలను తాత్కాలిక సీఈవోకు పంపారు. తాము చేసిన తప్పునకు చింతిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
దీనిపై క్రికెట్ స్కాట్లాండ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘బోర్డ్ ఆఫ్ క్రికెట్ స్కాట్లాండ్ రాజీనామా చేసింది. మేము వెంటనే అమల్లోకి వచ్చేలా @sportscotland తో కలిసి పనిచేస్తాము. రాబోయే రోజుల్లో ఈ క్రీడకు తగిని సముచిత పాలన, నాయకత్వం కలిగిన బోర్డును చూస్తాము’ అని ట్వీట్లో పేర్కొంది. ఇది తమకు ఒక గుణపాఠమని, భవిష్యత్లో ఇలా జరుగకుండా చూసుకుంటామని ఆ ప్రకటనలో తెలిపింది.
NEWS UPDATE | The Board of Cricket Scotland has resigned. We will work in partnership with @sportscotland with immediate effect to ensure appropriate governance, leadership & support is in place for sport in the days ahead.
Find out more ➡️ https://t.co/S6AF7EyE4A pic.twitter.com/qa2Y0ybcNP
— Cricket Scotland (@CricketScotland) July 24, 2022