టోక్యో: ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో టోక్యో ఒలింపిక్స్( Tokyo Olympics )కు ప్రత్యేక స్థానం ఉంది. కొవిడ్ నేపథ్యంలో ఏడాది వాయిదా పడి, అసాధారణ పరిస్థితుల్లో ప్రేక్షకులను అనుమతించకుండా జరిగిన తొలి ఒలింపిక్ గేమ్స్ ఇవే కావడం విశేషం. గేమ్స్ ప్రారంభానికి ముందు టోక్యోలో ఎమర్జెన్సీ పరిస్థితులు, గేమ్స్ విలేజ్లో అథ్లెట్లు కొవిడ్ బారిన పడినా మొత్తానికి రెండు వారాల పాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి.
అమెరికా, చైనా హోరాహోరీ
ఎప్పటిలాగే ఈసారి కూడా మెడల్స్ జాబితాలో టాప్లో ఉండటానికి అమెరికా, చైనా మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నది. గేమ్స్లో చాలా రోజుల వరకూ టాప్లో ఉన్న చైనాను చివరి రోజు అమెరికా వెనక్కి నెట్టడం విశేషం. శనివారం వరకూ చూస్తే చైనా 38 గోల్డ్ మెడల్స్తో టాప్లో ఉండగా.. అమెరికా ఖాతాలో 36 మాత్రమే ఉన్నాయి. అయితే ఆదివారం బాస్కెట్బాల్, వాలీబాల్లతోపాటు సైక్లిస్ట్ జెన్నిఫర్ వాలెంటీ కూడా గోల్డ్ గెలవడంతో అగ్రరాజ్యం మళ్లీ టాప్లోకి వెళ్లింది. ఒలింపిక్స్లో అత్యధిక మెడల్స్తో అమెరికా ముగించడం ఇది వరుసగా మూడోసారి. రికార్డు స్థాయిలో 600కుపైగా అథ్లెట్లతో బరిలోకి దిగిన అమెరికా.. మొత్తానికి తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.
అమెరికా ఖాతాలో 39 గోల్డ్ మెడల్స్తోపాటు మొత్తం 113 మెడల్స్ ఉన్నాయి. గోల్డ్మెడల్ పరంగా చూసినా, మొత్తంగా చూసినా అమెరికానే టాప్లో ఉంది. అయితే రియోగేమ్స్లో అమెరికాకు 121 మెడల్స్ వచ్చాయి. అందులో 46 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఆ గేమ్స్తో పోలిస్తే ఈసారి అగ్రరాజ్యం ప్రదర్శన అంత మెరుగ్గా లేదనే చెప్పాలి. అంతేకాదు ఆధునిక గేమ్స్ చరిత్రలో తొలిసారి అమెరికాకు ట్రాక్ ఈవెంట్లలో ఒక్క వ్యక్తిగత గోల్డ్ మెడల్ కూడా రాలేదు. ఇక చైనాతో 38 స్వర్ణాలతోపాటు మొత్తం 88 మెడల్స్తో రెండోస్థానంతో సరిపెట్టుకుంది. గోల్డ్ మెడల్స్ పరంగా జపాన్ (27), బ్రిటన్ (22), రష్యన్ ఒలింపిక్ కమిటీ (20) టాప్ 5లో ఉన్నాయి.
ఇండియా@48
టోక్యో ఒలింపిక్స్లో ఇండియా పరిస్థితి చాలా మెరుగైందనే చెప్పాలి. రియో గేమ్స్లో 67వ స్థానంతో సరిపెట్టుకున్న భారత్.. ఈసారి ఏకంగా 19 స్థానాలు ఎగబాకింది. ఈసారి కూడా శనివారం ఉదయం వరకూ ఇండియా 66కి అటుఇటూగా ఉంటూ వచ్చింది. అయితే జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్తో ఒకేసారి 47వ స్థానానికి వచ్చింది. ఆదివారం ఆటలు ముగిసే సమయానికి ఒక స్థానం దిగజారి 48తో సరిపెట్టుకుంది. ఇండియా ఖాతాలో 1 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ సహా మొత్తం 7 మెడల్స్ ఉన్నాయి. ఒలింపిక్స్లో ఇండియా సాధించిన అత్యధిక మెడల్స్ ఇవే కావడం విశేషం.
చైనాకు తొలి గోల్డ్.. సెర్బియాకు చివరిది
ఇక టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణాల బోణీని చైనా చేయగా.. చివరి గోల్డ్ మెడల్ను సెర్బియా అందుకుంది. ఆదివారం జరిగిన మెన్స్ వాటర్పోలో ఫైనల్లో గ్రీస్పై గెలిచి సెర్బియా చివరి గోల్డ్ మెడల్ను సొంతం చేసుకుంది.