ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లలో అంబటి రాయుడు ఒకడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ బ్యాటర్.. తన కెరీర్లో ఎన్నో మరపురాని ఇన్నింగ్సులు ఆడాడు. అలాంటి రాయుడు.. సడెన్గా తన ఐపీఎల్ కెరీర్కు గుడ్బై చెప్పేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో అంతా షాకైనా కూడా రాయుడు వయసును దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయాన్ని స్వాగతించారు.
అయితే అరగంట తిరక్కముందే ఆ నిర్ణయాన్ని రాయుడు వాపస్ తీసుకున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో చెన్నై ఘోర పరాజయం తర్వాత.. రాయుడు ఒక ట్వీట్ చేశాడు. ‘‘ఇదే నా ఆఖరి ఐపీఎల్ అని చెప్పడానికి సంతోషిస్తున్నా. పదమూడేళ్ల పాటు రెండు అత్యుత్తమ జట్లకు ఆడుతూ ఆ కాలాన్ని చాలా సంతోషంగా గడిపాను. ఈ ప్రయాణాన్ని ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్కు ధన్యవాదాలు’’ అని ప్రకటించాడు.
దీంతో చాలా మంది అభిమానులు, కొందరు మాజీలు అతని నిర్ణయంపై స్పందించారు. మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా తను ఎప్పుడూ రాయుడు ఎనర్జీని, ఆటతీరును అభిమానించానని పేర్కొన్నాడు. అంతలోనే ఏమైందో రాయుడు తన ట్వీట్ డిలీట్ చేసేశాడు. దీనిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. తాను రాయుడుతో మాట్లాడానని, ఇది ఒక సైకలాజికల్ విషయమని, అంతకుమించి ఇంకేమీ లేదని చెప్పాడు. రాయుడు జట్టుతో కొనసాగుతాడని స్పష్టం చేశాడు.