పారిస్: జెండర్ వివాదంలో ఇరుక్కున్న అల్జీరియా మహిళా బాక్సర్ ఇమేని ఖాలిఫ్(Imane Khelif).. పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలుచుకున్నది. వెల్టర్వెయిట్ క్యాటగిరీ ఫైనల్లో ఆమె చైనా బాక్సర్ యాంగ్ లియూను ఓడించింది. 2022 వరల్డ్ చాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ గెలిచిన ఖాలిఫ్.. ఆ తర్వాత లింగ వివాదాన్ని ఎదుర్కొన్నారు. ఆమెలో వై క్రోమోజోమ్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని రిపోర్టుల ద్వారా తేలింది. పారిస్ ఒలింపిక్స్లోనూ ప్రీక్వార్టర్స్ లో ఇటలీ బాక్సర్.. కేవలం 46 సెకన్లలోనే మ్యాచ్ నుంచి వైదొలిగింది.
ఫైనల్లో ఏకపక్ష నిర్ణయంతో ఖాలిఫ్ గోల్డ్ మెడల్ను సొంతంచేసుకున్నది. బాక్సింగ్ టైటిల్ గెలిచిన అల్జీరియా తొలి మహిళా బాక్సర్గా ఆమెకు గుర్తింపు ఉన్నది. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ నుంచి మహిళల బాక్సింగ్ ఈవెంట్ను మొదలుపెట్టారు. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలవాన్న సంకల్పం ఉండేదని, 8 ఏళ్ల తన కల ఫలించినట్లు ఆమె పేర్కొన్నది.
2023 వరల్డ్ చాంపియన్షిప్ సమయంలో జెండర్ పరీక్ష ద్వారా ఇమేని ఖాలిఫ్ను అనర్హురాలిగా ప్రకటించారు. కానీ పారిస్ ఒలింపిక్స్ కోసం మాత్రం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ.. 2016, 2021 నాటి ఒలింపిక్స్ రూల్స్ను అమలు చేసింది. దీంతో బాక్సర్ ఖాలిఫ్కు పారిస్లో ఆడేందుకు అవకాశం దక్కింది.
ఫైనల్ కోసం ఎరుపు రంగు దుస్తుల్లో రింగ్లోకి రాగానే.. స్టేడియంలో ఇమేనీ ఇమేనీ అంటూ అరుపులు మారుమోగాయి. ఆ వాతావరణంలో చైనా బాక్సర్ యాంగ్ ఒంటరి అయిపోయారు. తొలి రౌండ్లోనే ప్రత్యర్థికి లెఫ్ట్, రైట్ హుక్ ఇచ్చింది ఖాలిఫ్. పూర్తి కంట్రోల్ తీసుకున్న అల్జీరియా బాక్సర్ .. ఈజీగా చైనీస్ అమ్మాయిని ఓడించి స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నది.