INDvsNZ: వన్డే ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు సిద్ధమవుతున్న టీమిండియాకు క్రికెట్ అభిమానుల నుంచే గాక ఫుట్బాల్ స్టార్స్ నుంచీ మద్దతు లభిస్తోంది. బుధవారం వాంఖడే వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగబోయే మ్యాచ్లో టీమిండియాకు ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ బెర్న్ మునిచ్, జర్మన్ ఫుట్బాల్ దిగ్గజం థామస్ ముల్లర్ మద్దతు తెలిపాడు. టీమిండియా జెర్సీ ధరించి రోహిత్ సేనకు తన మద్దతు ప్రకటించాడు.
ప్రపంచకప్ సెమీస్కు ముందు ముల్లర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా వేదికగా స్పందిస్తూ.. ‘ఇది చూడండి. ఈ షర్ట్ పంపినందుకు గాను టీమిండియాకు ధన్యవాదాలు. క్రికెట్ వరల్డ్ కప్లో మీకు గుడ్ లక్’ అంటూ టీమిండియా అతడికి పంపిన జెర్సీని వేసుకుని రోహిత్ సేనకు శుభాకాంక్షలు తెలిపాడు. వీడియోలో ముల్లర్.. విరాట్ కోహ్లీ పేరు కూడా మెన్షన్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Look at this, @imVkohli 😃🏏
Thank you for the shirt, #TeamIndia! 👍
Good luck at the @cricketworldcup #esmuellert #Cricket pic.twitter.com/liBA4nrVmT— Thomas Müller (@esmuellert_) November 13, 2023
ముల్లరే గాక భారత్-కివీస్ మధ్య జరుగబోయే సెమీఫైనల్స్ను వీక్షించడానికి గాను ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం, ఇంగ్లండ్ మాజీ ఆటగాడు డేవిడ్ బెక్హమ్ కూడా రానున్నాడని తెలుస్తోంది. బెక్హమ్.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో కలిసి వాంఖడేలో మ్యాచ్ వీక్షిస్తాడని సమాచారం. భారత్ – కివీస్ల మధ్య బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ మొదలుకానుంది.