IND vs ENG 1st Test: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సిరీస్లో అతడు 500 వికెట్ల మైలురాయికి పది వికెట్ల దూరంలో ఉన్నాడు. స్పిన్కు అనుకూలించే భారత పిచ్లలో అశ్విన్కు ఇదేం పెద్ద విషయం కాదు. ఈ రికార్డుతో పాటు అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. ఈ సిరీస్లో గనక అశ్విన్.. ఏడు వికెట్లు తీస్తే భారత్ – ఇంగ్లండ్ మధ్య అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇండియా నుంచి అగ్రస్థానంలో నిలుస్తాడు.
భారత్ – ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకూ జరిగిన టెస్టులలో ఇండియా నుంచి అత్యధిక వికెట్లు తీసిన ఘనత భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్.. 38 ఇన్నింగ్స్లో 95 వికెట్లు తీశాడు. ఇందులో ఐదు వికెట్ల ప్రదర్శన ఎనిమిది సార్లు నమోదుచేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో అనిల్ కుంబ్లే ఉన్నాడు. జంబో.. ఇంగ్లండ్పై 92 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత స్థానంలో రవిచంద్రన్ అశ్విన్.. 35 ఇన్నింగ్స్లలో బౌలింగ్కు వచ్చి 88 వికెట్లు తీశాడు. ఐదు వికెట్లు తీస్తే కుంబ్లేను దాటే అవకాశముండగా 8 వికెట్లు పడగొడితే అగ్రస్థానంలో ఉంటాడు.
ఇరు దేశాల మధ్య అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అందరికంటే ముందున్నాడు. ఈ వెటరన్ పేసర్.. 66 ఇన్నింగ్స్లో ఏకంగా 139 వికెట్లు సాధించాడు. ఈ సిరీస్లో 8 వికెట్లు పడగొడితే భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచే అశ్విన్.. 12 వికెట్లు పడగొడితే వంద వికెట్లు తీసిన బౌలర్గా నిలుస్తాడు. ఒకవేళ హైదరాబాద్ వేదికగా ఈనెల 25 నుంచి జరుగబోయే టెస్టులోనే ఇది సాధిస్తే అశ్విన్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంతో పాటు ఐదు వందల వికెట్ల మైలురాయిని కూడా దాటేస్తాడు. మరి అశ్విన్ ఈ ఘనతను ఉప్పల్లోనే సాధించాలని భాగ్యనగర అభిమానులు కోరుకుంటున్నారు.