మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా అయింది ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ పరిస్థితి. ఇప్పటికే వరుసగా రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయిన ఆ జట్టుకు గాయాల బెడదతో పాటు కరోనా కూడా పట్టి పీడిస్తున్నది. కివీస్ జట్టులో కెప్టెన్ తో పాటు ఇప్పటికే ముగ్గురు ఈ వైరస్ బారిన పడగా తాజాగా మరో స్టార్ ఆటగాడు డెవాన్ కాన్వేకూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన రెండో టెస్టుకు ముందు కివీస్ సారథి కేన్ విలియమ్సన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. అతడితో పాటు జట్టులోని మరో ఇద్దరు సిబ్బంది కూడా ఈ వైరస్ బారినపడ్డారు. ఇక బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మైకెల్ బ్రాస్వెల్ కు కూడా వైరస్ సోకినట్టు తేలింది. ఇక తాజాగా కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే సైతం కరోనా మహమ్మారి బారిన పడ్డాడు.
ఈ ముగ్గురిలో కేన్ విలియమ్సన్ ప్రస్తుతం ఐదు రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడు. కానీ బ్రాస్వెల్, కాన్వేలు మాత్రం బుధవారం నుంచే ఐసోలేషన్ లోకి ఉన్నారు. దీంతో వాళ్లు ఈనెల 23 నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కాబోయే మూడో టెస్టు ఆడటం అనుమానమే.
ఇదిలాఉండగా కరోనాతో పాటు గాయాలు కూడా కివీస్ ను వేధిస్తున్నాయి. తొలి టెస్టు అనంతరం ఆల్ రౌండర్ కొలిన్ గ్రాండ్హోమ్ గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. రెండో టెస్టు తర్వాత కైల్ జెమీసన్ కూ గాయమైంది. దీంతో అతడు కూడా లీడ్స్ టెస్టు ఆడటం డౌటే. మూడో టెస్టుకు మరో వారం రోజుల సమయం ఉన్నా అప్పటివరకు ఇంకెంతమంది ఆటగాళ్లు కరోనా బారిన పడతారో అని కివీస్ యాజమాన్యం ఆందోళన చెందుతున్నది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సిరీస్ సజావుగా సాగుతుందా..? లేదా..? అని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సందేహంలో ఉంది.