గతంలో నాలుగు దేశాల టీ20 టోర్నీ నిర్వహించాలని పట్టుబట్టి సభ్య దేశాల ముందు నవ్వులపాలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో కొత్తరాగం అందుకుంది. ఇప్పుడు అదే ప్రతిపానదలో కాస్త మార్పులు చేసి ముక్కోణపు టోర్నీ అయినా జరపాలని కోరుతున్నది. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో కలిసి ఏడాదికోసారి టీ20 సిరీస్ నిర్వహించాలని పీసీబీ గతంలో ప్రతిపాదించింది. కానీ ఈ ప్రతిపాదనకు సభ్య దేశాలు అంగీకారం తెలపకపోవడంతో అది కాస్తా అటకెక్కింది.
ఇండియాతో ఆడటం ఇక కష్టమని భావించిన పీసీబీ.. ఆ జట్టును మినహాయించి మిగిలిన మూడు దేశాల (పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్)తో ముక్కోణపు సిరీస్ ఆడించాలని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. టీ20 ఫార్మాట్ లో ఉండబోయే ఈ టోర్నీని వచ్చే నాలుగేండ్ల ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) లో చేర్చాలని కోరుతున్నది.
ఈ మేరకు వచ్చే నెల బర్మింగ్ హోమ్ (యూకే)లో కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జరుగబోయే ఐసీసీ సమావేశంలో పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా ఇందుకు సంబంధించిన వివరాలను సభ్యుల ముందు ప్రవేశపెట్టనున్నాడు. ‘నాలుగు దేశాల టీ20 సిరీస్ కు ప్రత్యామ్నయంగా దీనిని తీసుకొస్తున్నాం. రమీజ్ రాజా దీనిని ప్రతిపాదించారు. దీనిపై ఆయన రాబోయే ఐసీసీ సమావేశంలో సభ్య దేశాలకు వివరిస్తాడు..’ అని పీసీబీ బోర్డు వర్గాలు తెలిపాయి.
నాలుగుదేశాల టీ20 టోర్నీ గురించి పాక్ భారీ ఆశలు పెట్టుకుంది. తటస్థ వేదికపై ఈ టోర్నీని ఆడించాలని తద్వారా వచ్చే ఆదాయాన్ని నాలుగు దేశాలు సమంగా పంచుకుందామని ప్రతిపాదించింది. కానీ ప్రస్తుతం ఇండియా-పాక్ మధ్య ఉన్న రాజకీయ, సరిహద్దు వివాదాల కారణంగా అది సాధ్యపడదని పీసీబీకి చాలా ఆలస్యంగా తెలిసొచ్చింది. ఈ ప్రతిపాదనపై బీసీసీఐ అంత ఆసక్తి చూపలేదు. దీంతో పాక్ ఆశలు అడియాసలయ్యాయి. ఇక పాకిస్తాన్ కు ఈ ముక్కోణపు ముచ్చట అయినా తీరుతుందో లేదో చూడాలి మరి. పాత సీసాలో పోస్తున్న కొత్త సారా దానికి రుచిస్తుందా..? అనేదానికి బర్మింగ్ హోమ్ సమాధానం చెప్పనుంది.