వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఇంగ్లండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్. మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం వల్ల తాను అలిసిపోయానని.. వన్డేలకు న్యాయం చేయలేకపోతున్నానని అతడు సోమవారం 50 ఓవర్ల ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. స్టోక్స్ నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హుస్సేన్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా నిరాశపరిచే వార్త. ప్రస్తుతం క్రికెట్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉంది..? దానివల్ల ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది స్టోక్స్ నిర్ణయంలో స్పష్టంగా కనిపించింది. అవును.. ఇంత తీరిక లేని షెడ్యూల్ ఉంటే ఆటగాళ్లకు పిచ్చెక్కకుండా ఏం జరుగుతుంది..? ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్ లు.. మధ్యలో సందు దొరికితే ఫ్రాంచైజీ క్రికెట్ వల్ల ఆటగాళ్లు శారీరకంగానే గాక మానసికంగా కూడా అలిసిపోతున్నారు. ఇంత తీరిక లేని షెడ్యూల్ లో వాళ్లు ఆటకు గుడ్ బై చెప్పకుంటే ఇంకేం చెబుతారు..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
స్టోక్స్ నిర్ణయం తర్వాత అయినా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), ఐసీసీ లు తమ షెడ్యూల్ లు, ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP) పై మరోసారి ఆలోచించాలని హుస్సేన్ సూచించాడు.
‘31 ఏండ్లకే స్టోక్స్ వన్డేల నుంచి తప్పుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ షెడ్యూల్స్ పై దృష్టి సారించండి. అలాగే వన్డేలపై కూడా. అందరూ టెస్టు క్రికెట్, టీ20 లనే ఇష్టపడుతున్నారు. మరి 50 ఓవర్ల ఫార్మాట్ సంగతేంటి..?’ అని ప్రశ్నించాడు. స్టోక్స్ మంగళవారం తన హోంగ్రౌండ్ (డర్హమ్) లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఆడి వన్డే కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నాడు.