Asia CUP 2023 : ఈ ఏడాది ఆసియా కప్ జరిగేది ఎక్కడ? ఆతిథ్య దేశం ఏది? అనే విషయం ఇప్పట్లో తేలేలా లేదు. హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో మ్యాచ్లు నిర్వహించాలని పట్టుపడుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)కు భారీ ఎదురుదెబ్బ తగలడమే అందుకు కారణం. అయితే..తాజాగా పీసీబీకి ఆసియా దేశాలు ఝలక్ ఇచ్చాయి. ఆసియా కప్లో ఆడనున్న అఫ్గనిస్థాన్, శ్రీలంకతో సహా బంగ్లాదేశ్ కూడా పాక్ డిమాండ్కు నో చెప్పాయి. దాంతో, నజం సేథీ(Najam Sethi) బృందం దిక్కుతోచని స్థితిలో పడింది.
ఈ ఏడాది ఆసియా కప్ను పాకిస్థాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ, భద్రత కారణాల రీత్యా భారత జట్టును పాక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ పంపబోమని బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) తేల్చి చెప్పాడు. దాంతో, పీసీబీ హైబ్రిడ్ మోడల్ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం.. నాలుగైదు మ్యాచ్లో పాకిస్థాన్లో, మిగతావి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే.. మొదటి నుంచి బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ను వ్యతిరేకిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.
ఆసియా కప్ వేదికపై సందిగ్ధత నెలకొనడంతో.. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023) ముగిశాక వేదిక ఖరారుపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన అతను సభ్య దేశాలతో మాట్లాడి ప్రకటన చేస్తామని అన్నాడు. కానీ, ఐపీఎల్ సీజన్ పూరయ్యి వారం దాటింది. అయితే.. ఈమధ్యే శ్రీలంక క్రికెట్ బోర్డు తాము ఆసియా కప్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐ పెద్దలు కూడా శ్రీలంక వైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో, ఈసారి కూడా లంకలోనే టోర్నమెంట్ జరిగే అవకాశం ఉంది. గత ఏడాది సొంత గడ్డపై దసున్ షనక సారథ్యంలోని శ్రీలంక ఆసియా కప్ను సొంతం చేసుకుంది.