ముంబై: 2011 వన్డే వరల్డ్ కప్ను ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. ఆ టోర్నీ ఫైనల్లో కెప్టెన్ ధోనీ(dhoni) కొట్టిన సిక్సర్ కూడా అందరికీ గుర్తుండిపోయే విషయమే. అయితే ఆ బంతి వెళ్లి వాంఖడే స్టేడియం(wankhede stadium)లో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరును పెట్టనున్నారు. ముంబై క్రికెట్ సంఘం ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ ఈ విషయాన్ని తెలిపారు. ఆ నాటి ఫైనల్లో లంక బౌలర్ కులశేఖర్ వేసిన బంతిని .. ధోనీ తనదైన స్టయిల్లో విన్నింగ్ షాట్ కొట్టాడు. సిక్సర్ వెళ్లిన ఆ బంతి.. ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ధోనీ పేరు పెట్టాలని ఫిక్స్ అయినట్లు అమోల్ ఖేల్ తెలిపాడు.
పేరు ఆవిష్కరణ కార్యక్రమం కోసం ధోనీని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్కు సచిన్, గవాస్కర్, విజయ్ మర్చంట్ పేర్లు ఉన్నాయి. కొన్ని గేట్లకు ఉమ్రిగర్, వినూ మన్కడ్ పేర్లు పెట్టారు. వన్డే వరల్డ్ కప్ గెలిచి 12 ఏళ్ల అయిన సందర్భంగా ధోనీ కూడా ఆ ఫైనల్కు చెందిన కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఆ ఫైనల్లో చివరి 20 నిమిషాలు అద్భుతంగా ఫీలైనట్లు చెప్పాడు.