యాదాద్రి భువనగిరి: రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సువాలీ ఎస్టేట్స్లో రోలర్ స్కేటింగ్ రింక్ రూపుదిద్దుకున్నది. అత్యాధునిక హంగులతో నిర్మితమైన ఈ స్కేటింగ్ రింక్ రాష్ట్రంలో తొలి క్రీడా ప్రాంగణంగా రికార్డుల్లోకెక్కింది. ఇక్కడ ప్యారబోలిక్ 200మీటర్ల స్కేటింగ్ రింక్ను స్కేట్లరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. శనివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి రింక్ను ప్రారంభించారు.
ఆ తర్వాత రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలను మొదలుపెట్టారు. ఈ టోర్నీలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 780 మంది ప్లేయర్లు పోటీపడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో సౌత్జోన్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు ఎస్టేట్ చైర్మన్ సుభాశ్రెడ్డి తెలిపారు. పదివేల మంది స్కేటర్లు పాల్గొనే అవకాశముందని ఆయన వివరించారు.