Suraykumar Yadav : మూడో టీ20లో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తుఫాన్ ఇన్నింగ్స్తో సెంచరీ బాదాడు. గ్రౌండ్ నలువైపులా బౌండరలు కొడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. విధ్వంసకర ఆటతో జట్టును గెలిపించిన సూర్య మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో టీ20ల్లో తన సక్సెస్ మంత్ర ఏంటో చెప్పుకొచ్చాడు. ‘మైదానంలోకి దిగేముందు ఎవరైనా తమమీద ఒత్తిడి పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎంత ఒత్తిడికి లోనైతే అంత బాగా ఆడగలరు. టీ20ల్లో సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంది. కొన్ని నాణ్యమైన ప్రాక్టీస్ సెషన్లు కూడా నా గేమ్ మెరుగుపడడంలో ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ సక్సెస్లో కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా ఉంది. నా సహజసిద్ధమైన ఆటను అతను ప్రోత్సహించాడు’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
అంతేకాదు ‘రాజ్కోట్ స్టేడియంలో బౌండరీలు 59- 60 మీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకని కొన్ని షాట్లు ఆడాలని ముందుగానే నిర్ణయించుకున్నా. బంతిని బట్టి మిగతా షాట్లు ఆడేందుకు సిద్దంగా ఉన్నాను. చాలా వరకు గ్యాప్లలో షాట్స్ కొట్టేందుకు ప్రయత్నించా’ అని సూర్య తెలిపాడు.
మూడో టీ20లో పవర్ప్లేలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయిన దశలో సూర్య క్రీజులోకి వచ్చాడు. రెండు మ్యాచుల్లో భారీ స్కోర్ చేయలేకపోయిన అతను ఈ మ్యాచ్లో వీరవిహారం చేశాడు. 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 112 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక 137 పరుగులకే కుప్పకూలింది.