భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. దాదాపు ఆరు దశబ్దాల తర్వాత భారత పురుషుల డబుల్స్ జోడీ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గింది. తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్తో పాటు చిరాగ్ శెట్టి అద్వితీయ ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు!
దుబాయ్: ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట నయా రికార్డు లిఖించింది. 58 ఏండ్ల తర్వాత ఈ మెగాటోర్నీలో స్వర్ణం సాధించిన భారత షట్లర్లుగా వీరిద్దరూ చరిత్రకెక్కారు. పురుషుల డబుల్స్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం కాగా.. గతంలో దినేశ్ ఖన్నా 1965లో పురుషుల సింగిల్స్ చాంపియన్గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 16-21, 21-17, 21-19తో ఎనిమిదో సీడ్ ఆంగ్ యే సిన్-టోయ్ యీ (మలేషియా) జంటపై గెలుపొందింది. తొలి గేమ్ కోల్పోయిన భారత షట్లర్లు ఆ తర్వాత విజృంభించి వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని చిత్తుచేశారు. ఆసియా చాంపియన్షిప్ డబుల్స్లో భారత్ నుంచి చివరిసారిగా దీపు ఘోష్-రమన్ ఘోష్ జంట 1971లో కాంస్యం నెగ్గింది. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత భారత జోడీ డబుల్స్లో పతకం పట్టింది. ఈ ఏడాది అద్వితీయమైన ఫామ్లో ఉన్న సాత్విక్-చిరాగ్ జోడీ భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగిస్తూ.. మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేసింది.
ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈ విజయంతో మేఘాల్లో తేలుతున్నట్లుంది. స్వర్ణం నెగ్గడం మా ఆనందాన్ని రెట్టింపు చేసింది. కలిసికట్టుగా ఆడటం వల్లే ఇది సాధ్యమైంది. ఇకముందూ ఇదే జోరు కొనసాగిస్తాం. – సాత్విక్