హనుమకొండ చౌరస్తా: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో శనివారం 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీ ప్రారంభమైంది. ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 16, 18, 20 జూనియర్ అథ్లెటిక్స్ విభాగాల్లో రెండు రోజుల పాటు జరిగే పోటీల్లో 33 జిల్లాల నుంచి 1000 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. మొత్తం 22 ఈవెంట్లలో ప్లేయర్లు అదరగొట్టారు. జేఎన్ఎస్లోని సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్పై పరుగులు తీస్తూ నువ్వా,నేనా అన్నట్లు తలపడ్డారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషితో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఈ పోటీలను ప్రారంభించారు.
క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడలు ఇకడ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అథ్లెట్ల కిట్స్ కోసం తన నెల జీతం 1 లక్షా 16 వేల రూపాయలను ఇస్తానని వినయ్భాస్కర్ ప్రకటించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన ప్లేయర్లు వచ్చే నెల 11 నుంచి 15 వరకు గువాహటిలో జరిగే జాతీయ జూనియర్ టోర్నీలో పాల్గొంటారని ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయి టోర్నీలో ఖమ్మం పతకాల వేటలో దూసుకెళుతున్నది. పోటీల తొలి రోజు శనివారం జరిగిన వేర్వేరు విభాగాల్లో ఖమ్మం ప్లేయర్లు ఎనిమిది స్వర్ణ పతకాలతో మెరిశారు. దీనికి తోడు ఏడు రజతాలు, మూడు కాంస్యాలు ఖాతాలో వేసుకుంది. ప్రతీ విభాగంలో ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చిన ఖమ్మం పోడియం ఫినిష్ చేసింది. వరంగల్కు చెందిన అథ్లెట్లు మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలు కైవసం చేసుకోగా, ఆదిలాబాద్ ఐదు స్వర్ణాలు, రజతం, రంగారెడ్డి నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యాలు దక్కించుకున్నాయి.