ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేశారు.. మరో ముగ్గురు చక్కటి ఇన్నింగ్స్లు ఆడారు.. బోర్డు మీద మంచి స్కోరే పెట్టాం అనుకున్న టీమ్ఇండియాకు గట్టి దెబ్బే తగిలింది!సిరీస్ ఆరంభం నుంచి ‘బజ్బాల్’ పాట పాడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్లు.. మరోసారి దాని ప్రతాపమేంటో చూపారు.
ఆడుతున్నది టెస్టు మ్యాచా.. లేక టీ20నా అన్నట్లు రాజ్కోట్లో పరుగుల వరద పారించారు!ఓపెనర్ బెన్ డకెట్ రికార్డు సెంచరీతో చెలరేగితే.. మిగిలినవాళ్లు అతడికి మద్దతుగా నిలిచారు.
ఫలితంగా ఒక్క సెషన్లోనే మన స్కోరులో దాదాపు సగం పూర్తి చేసిన ఇంగ్లండ్.. మంచి స్థితికి చేరింది. బ్యాటింగ్లో విలువైన పరుగులు జోడించిన అశ్విన్.. బౌలింగ్లో 500 టెస్టు వికెట్లు పూర్తి చేసుకోవడం టీమ్ఇండియాకు ఊరటనిచ్చే అశం!!
రాజ్కోట్: ఓపెనర్ బెన్ డకెట్ (118 బంతుల్లో 133 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) వీర విజృంభణతో మూడో టెస్టు రసకందాయంలో పడింది. భారీ స్కోరు చేశామనుకున్న టీమ్ఇండియాకు ఒక్క సెషన్లోనే డకెట్ చుక్కలు చూపాడు. బంతి ఎలా పడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్నట్లు విరుచుకుపడిన డకెట్.. భారత గడ్డపై వేగవంతమైన శతకం చేసిన ఇంగ్లండ్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. డకెట్ విధ్వంస కాండతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. మరో ఓపెనర్ జాక్ క్రాలీ (15) త్వరగానే ఔటైనా.. ఓలీ పోప్ (39; 5 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి డకెట్ దంచికొట్టాడు. స్వీప్, రివర్స్ స్వీప్, దిల్ స్కూప్, స్విచ్హిట్.. ఇలా ఒక్కటేంటి టీ20 క్రికెట్లోని షాట్లన్నింటినీ సంప్రదాయ ఆటలో చూపాడు. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇంత తేలికా అన్నట్లు డకెట్ విశ్వరూపం చూపాడు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఇంగ్లండ్.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. డకెట్తో పాటు మాజీ కెప్టెన్ జో రూట్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. క్రాలీ వికెట్ తీయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. సిరాజ్కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 326/5తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్ సేన 445 పరుగులకు ఆలౌటైంది. జడేజా (112) క్రితం రోజు స్కోరుకు రెండు పరుగులు చేసి వెనుదిరగగా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అశ్విన్ (37), బుమ్రా (26) విలువైన పరుగులు జోడించారు.
ఐదు పరుగుల పెనాల్టీ..
బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అశ్విన్ డేంజర్ ఏరియాలో పరిగెత్తినందుకు గానూ.. ఈ మ్యాచ్లో భారత జట్టుకు పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్ స్కోరు బోర్డుపై 5/0 దర్శనమిచ్చింది. ఫ్రీగా వచ్చిన పరుగుల స్ఫూర్తిని ఇంగ్లండ్ చివరి వరకు కొనసాగించింది.
సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్లో వరుసగా రెండు రోజులు సమానమైన పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. గురువారం భారత్ 326 పరుగులు చేయగా.. శుక్రవారం ఇరు జట్లు కలిపి కూడా సరిగ్గా 326 రన్స్ కొట్టాయి. భారత్ నుంచి 500 టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ నిలిచాడు. అనిల్ కుంబ్లే (619) ముందున్నాడు.
బ్యాటర్ అవుదామనుకొని..
క్రికెట్లో అరుదైన ఘనత సాధించిన అశ్విన్.. అసలు బౌలర్ కావాలనే అనుకోలేదంటే నమ్మగలరా! ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో బ్యాటింగ్పైనే దృష్టి పెట్టిన అశ్విన్.. ఆ తర్వాత ఆఫ్స్పిన్ను తన అస్త్రంగా మార్చుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్రతిసారి బ్రేక్త్రూ ఇప్పించడంతో పాటు.. టెస్టు క్రికెట్లో అటు బ్యాట్తోనూ జట్టుకు ఎన్నో ఉపయుక్త కర ఇన్నింగ్స్లు ఆడిన 37 ఏండ్ల అశ్విన్.. ఇప్పుడు మరో అరుధైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో క్రాలీని ఔట్ చేయడం ద్వారా అశ్విన్ 500 టెస్టు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. భారత్ నుంచి ఈ క్లబ్లో చేరిన రెండో బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. అనిల్ కుంబ్లే (619) అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు ఆఫ్స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్ (800), నాథన్ లియాన్ (517) మాత్రమే 500 వికెట్లు పడగొట్టారు. తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానన్న అశ్విన్.. తనలో వికెట్లు తీయాలనే కసి ఇంకా తీరలేదని పేర్కొన్నాడు.
అశ్విన్ ఇంట ఎమర్జెన్సీ!
రాజ్కోట్ టెస్టు నుంచి ఆఫ్స్పిన్నర్ అశ్విన్ తప్పుకున్నాడు. కుటుంబంలో అత్యవసర ఆరోగ్య పరిస్థితి నెలకొనడంతో మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఈ మేరకు
బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 445 (రోహిత్ 131, జడేజా 112; వుడ్ 4/114, రెహాన్ 2/85); ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 207/2 (డకెట్ 133 నాటౌట్; అశ్విన్ 1/37, సిరాజ్ 1/54).