హరారే: జింబాబ్వేపై తొలి రెండు వన్డేలలో సత్తాచాటిన భారత్ సోమవారం జరిగే మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని చూస్తున్నది. సిరీస్ ఫలితం ఇప్పటికే తేలినందున వచ్చే ఏడాది స్వదేశంలో జరుగనున్న ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని టీమ్ఇండియా మరిన్ని ప్రయోగాలు చేస్తుందనడంలో సందేహం లేదు. తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్కూడా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశమిస్తున్నాడు.
ముఖ్యంగా ఓపెనర్లు శిఖర్ ధవన్, శుభ్మన్ గిల్ మంచి ఫామ్మీదున్నారు. ఇంగ్లండ్, వెస్టిండీస్తో వన్డేల్లో ధవన్ ఆకట్టుకోగా, గిల్ అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నాడు. మ్యాచ్ మ్యాచ్కు మరింత పరిణతి సాధిస్తూ పరుగులు కొల్లగొడుతున్నాడు. అయితే గాయంతో చాలా రోజులు జట్టుకు దూరమైన తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్ ఒకింత ఆందోళన కల్గిస్తున్నది. రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన రాహుల్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయాడు. సంజూ శాంసన్, దీపక్ హుడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
బౌలింగ్లో యువ పేసర్లు మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ నిలకడగా రాణిస్తున్నారు. వీరికి తోడు స్పిన్నర్లు అక్షర్పటేల్, కుల్దీప్ యాదవ్ తమ ప్రతాపం చూపిస్తున్నారు. మరోవైపు జింబాబ్వే విషయానికొస్తే..కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. బంగ్లాదేశ్పై సిరీస్ విజయంతో ఊపుమీద కనిపించిన జింబాబ్వే..భారత్ను నిలువరించడంలో ఘోరంగా విఫలమైంది.
స్వల్ప స్కోర్లకే పరిమితమవుతూ వరుస మ్యాచ్ల్లో ఓటమి వైపు నిలిచింది. సమిష్టి ప్రదర్శనలో వైఫల్యంతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను భారత్కు చేజార్చుకుంది. సికిందర్ రజా, సీన్ విలియమ్స్ లాంటి ప్లేయర్లు అడపాదడపా రాణిస్తున్నా..జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోతున్నారు. చివరి మ్యాచ్లోనైనా టీమ్ఇండియాకు కనీస పోటీనివ్వాలని జింబాబ్వే కృతనిశ్చయంతో ఉంది.
జట్ల అంచనా
భారత్: రాహుల్(కెప్టెన్), ధవన్(వైస్ కెప్టెన్)/రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శాంసన్, అక్షర్ పటేల్/షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్/దీపక్ చాహర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
జింబాబ్వే: కైతానో, ఇన్నోసెంట్ట కైయా, రెజిస్ చక్బవా, వెస్లీ మెద్వెరె/టోనీ మున్యోగ్న, సికందర్ రజా, సీన్ విలియమ్స్, ర్యాన్ బర్ల్, ల్యూక్ జాన్వె, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ నౌచీ, తనా చివాంగ.