న్యూఢిల్లీ: 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో చోటు దక్కించుకున్న మహిళల టీ20 క్రికెట్కు షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. ఎనిమిది జట్లు పోటీ పడే గ్రూప్ మ్యాచ్లు ఆగస్టు 4 వరకు జరుగనుండగా… సెమీఫైనల్స్ 6న నిర్వహించనున్నారు. కాంస్య పతక మ్యాచ్తో పాటు ఫైనల్ ఆగస్టు 7న జరుగనుంది. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-6లో ఉన్న జట్లతో పాటు ఆతిథ్య హోదాలో ఇంగ్లండ్ నేరుగా కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించనుంది. ప్రస్తుతం భారత జట్టు మూడో ర్యాంకులో ఉంది. బర్మింగ్హామ్ క్రీడలతోనే మహిళల టీ20 క్రికెట్ తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో అడుగుపెట్టనుంది.