న్యూఢిల్లీ: 2028 ఒలింపిక్స్లో టాప్-10 దేశాల్లో భారత్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ.. ఆ దిశగా మరో ముందడుగు వేసింది. క్షేత్రస్థాయిలో ఉన్న యువ క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను మెరుగుపరిచేందుకు సిద్ధమైంది. ఇందుకుగాను దేశంలోని ఏడు రాష్ర్టాల్లో 143 ఖేలో ఇండియా కేంద్రాలను నెలకొల్పనుంది. రూ.14.30 కోట్ల వ్యయంతో మహారాష్ట్ర, మిజోరం, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో సెంటర్లో ఒక్కో క్రీడాంశం ఉండనుంది. 2028 ఒలింపిక్స్లో టాప్-10 దేశాల్లో భారత్ ఉండాలన్నది మా లక్ష్యం. ఇది నెరవేరేందుకు క్రీడల్లో ప్రతిభావంతులైన చిన్నారులను భారీ సంఖ్యలో గుర్తించి, వారికి మంచి శిక్షణ ఇవ్వాలి. జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసే ఈ ఖేలో ఇండియా కేంద్రాల్లో మంచి సదుపాయాలు ఉంటాయి అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.