హైదరాబాద్, ఆట ప్రతినిధి: అమెరికన్ ఫుట్బాల్ భారత జట్టు కెప్టెన్గా పోతిరెడ్డి సందీప్రెడ్డి ఎంపికయ్యాడు. ఇజ్రాయెల్ వేదికగా ఈనెల 6 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ప్రపంచ చాంపియన్షిప్లో బరిలోకి దిగుతున్న భారత జట్టుకు సందీప్ నాయకత్వం వహిస్తున్నాడు. చీఫ్కోచ్ ప్రవీణ్కుమార్రెడ్డి పర్యవేక్షణలో భారత జట్టు శిక్షణ శిబిరం బుధవారం హైదరాబాద్లో ముగిసింది. జాతీయ జట్టులో కడప జిల్లాకు చెందిన సందీప్ సహా తెలంగాణ నుంచి సంతోష్, కేతన్, రోనిత్ ఉండగా, ఏపీ తరఫున అవనీశ్, శివప్రసాద్, మణికంఠ ఉన్నారు. చివరిసారి 2018 ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ పదో స్థానంతో సరిపెట్టుకోగా, కరోనా వైరస్ విజృంభణ కారణంగా గతేడాది మెగాటోర్నీ రద్దయ్యింది. అయితే ఈసారి ఎలాగైనా సత్తాచాటాలని చూస్తున్న భారత్.. చాంపియన్షిప్లో మేటి జట్లు అయిన అమెరికా, స్పెయిన్కు దీటైన పోటీనిచ్చేందుకు పట్టుదలతో ఉన్నాయి. మొత్తం 24 దేశాలు పోటీపడుతున్న టోర్నీలో అగ్రశ్రేణి జట్లతో కలిసి భారత్ గ్రూపు-‘ఎ’లో ఉంది. డిఫెండింగ్ చాంపియన్ అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, చిలీతో కలిసి భారత్ మ్యాచ్లు ఆడనుంది. ఇందులో టాప్-8లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది జరిగే బర్మింగ్హామ్ ప్రపంచ గేమ్స్కు అర్హత సాధిస్తాయి. ఇదిలా ఉంటే..అంచనాలు అంతగా లేకపోయినా ప్రపంచ చాంపియన్షిప్లో అదరగొడుతామని కెప్టెన్ సందీప్రెడ్డి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.