బాలి: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ ప్రపంచ టూర్ ఫైనల్స్ టైటిల్పై భారత్ ఆశలు పెట్టుకుంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత షట్లర్లు తమ వేట సాగించనున్నారు. స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ షట్లర్ లక్ష్యసేన్ టైటిల్స్ చేజిక్కించుకోవడంపై కన్నేశారు. 2018లో సింగిల్స్ టైటిల్ చేజిక్కించుకున్న సింధు మరోసారి ఆ టైటిల్ను కైవసం చేసుకోవడానికి సిద్ధమైంది. విశ్వ క్రీడల్లో కాంస్యం మినహా ఈ ఏడాది ఒక్క టైటిల్ సాధించని సింధు ఆఖరి టోర్నీని విజయవంతంగా ముగించాలనే పట్టుదలతో ఉంది. గత చివరి మూడు టోర్నీల్లో సెమీస్ వరకు పోరాటం సాగించిన సింధు ఈమెగాటోర్నీని సవాల్గా తీసుకున్నది. మహిళల సింగిల్స్ ‘గ్రూపు-ఎ’లో ఉన్న సింధు.. లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో తొలి గేమ్లో తలపడనుంది. 2019లో ఐదు టైటిల్స్ సొంతం చేసుకున్న లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్లో గ్రూప్-ఎలో ఉన్నాడు. టాప్ సీడ్ కెంటో మొమోటో (జపాన్)తో లక్ష్య తొలి సవాల్ ఎదుర్కోనున్నాడు. ఈ టోర్నీలో కిడాంబి శ్రీకాంత్, సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి అమీతుమీ సిద్ధమయ్యారు. పురుషుల సింగిల్స్ ‘గ్రూప్ -బి’లో ఉన్న శ్రీకాంత్.. టొమ పొపొవా (బల్గేరియా)తో, పురుషుల డబుల్స్ ‘గ్రూపు-ఎ’లో సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ కిమ్ అస్రాప్ట్-అండర్స్ (డెన్మార్క్) జంటతో తలపడనుంది. మహిళల డబుల్స్ ‘గ్రూపు-బి’లో సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప ద్వయం నమి మత్సుయమ- చిహరు షిడా (జపాన్) జోడీతో తొలి గేమ్ ఆడనుంది.