ఢాకా: భారత స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం ముద్దాడింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో సురేఖ 146-145 తేడాతో హో యూహ్యున్(కొరియా)పై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన స్వర్ణ పతక పోరులో సురేఖ గురి చెక్కుచెదరలేదు. పోరు ఆసాంతం కొరియా ఆర్చర్కు దీటైన పోటీనిచ్చిన సురేఖ కీలక పాయింట్లు కైవసం చేసుకుంది. తొలి సెట్ నుంచే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఈ తెలుగు యువ ఆర్చర్ మూడో సెట్ ముగిసేసరికి 88-86 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. మరో ఎండ్లో యుహ్యూన్ కూడా పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే అప్పటికే పైచేయిలో ఉన్న సురేఖను అధిగమిద్దామనుకున్న కొరియా ఆర్చర్..ఆఖరి ప్రయత్నంలో 9 పాయింట్లు కైవసం చేసుకుంది. దీనిపై వివాదం చెలరేగింది. ఆర్చర్ సహా కొరియా బృందం స్కోరును 10గా పరిగణించాలంటూ రిఫరీకి ఫిర్యాదు చేసింది. ఇందుకు ఏమాత్రం ఒప్పుకోని రిఫరీలు సురేఖ వైపు మొగ్గుచూపుతూ విజేతగా ప్రకటిచండంతో పసిడి ఖాయమైంది. ఇటీవలే ప్రపంచ చాంపియన్షిప్లో మూడుసార్లు రజత పతకం సొంతం చేసుకున్న జ్యోతి ప్రస్తుతం 6వ ప్రపంచ ర్యాంక్తో కొనసాగుతున్నది. ఇక కాంపౌండ్ మిక్స్డ్లో జ్యోతి-రిషబ్ యాదవ్ ద్వయం ఒక పాయింట్ (154-155) తేడాతో కిమ్ యున్హీ- చోయ్ యాంగీ (కొరియా) జోడీ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. కాంపౌండ్ పురుషుల ఫైనల్లో అభిషేక్ 148-149తో ఓటమితో రెండోస్థానంలో నిలిచి వెండి పతకం పొందాడు.