ఆటగాళ్లు, సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతుండడంతో ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 14 ఏండ్ల లీగ్ చరిత్రలో ఇలా అర్ధాంతరంగా ముగియడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 9న ఆరంభమైన 2021 సీజన్లో మొత్తం 60 మ్యాచ్లకు గాను 29 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. 14వ సీజన్ను పూర్తిగా నిర్వహించడంలో విఫలమైతే బీసీసీఐ భారీగా ఆదాయాన్ని కోల్పోతుంది. మిగిలిన ఐపీఎల్ సీజన్ వైట్వాష్ ఐతే 2వేల కోట్లకు పైగా నష్టం వస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపారు.
ఒకవేళ టోర్నీలోని మిగతా మ్యాచ్లను నిర్వహించకుంటే సుమారు 2,500కోట్ల వరకు నష్టం రావొచ్చని దాదా పేర్కొన్నారు. ‘ఐపీఎల్ను వాయిదా వేసి కొన్ని రోజులు మాత్రమే అయింది. టీ20 వరల్డ్కప్నకు ముందు లీగ్లోని మిగతా మ్యాచ్లను పూర్తి చేసేందుకు విండో అందుబాటులో ఉందో లేదో చూడాలి. ఇతర బోర్డులతోనూ మాట్లాడాలి. లీగ్ నిర్వహణపై ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కదానిపై చర్చించాల్సి ఉందని’ టెలిగ్రాఫ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ చెప్పాడు. సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్ల నుంచి రావాల్సిన ఆదాయానికి గండి పడింది.