సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో ఉత్తమ మైన విద్య అందుతోందని, ఐదో తరగతిలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. గురుకుల పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గురువారం గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేటలో చేపట్టిన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ ఆల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో అడ్మిషన్ పొందాలంటే ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఉమ్మడి గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షకు అన్ని వర్గాల పిల్లలు దరఖాస్తు చేసుకొని పరీక్ష రాయాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ఉన్నత స్థాయి విద్య కొనసాగడం.. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ప్రవీణ్కుమార్ చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడారు.
అనంతరం పాత బస్టాండ్ వద్ద మహాత్మాజ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా గురుకుల పాఠశాల రీజినల్ కో ఆర్డినేటర్ నిర్మల మాట్లాడుతూ పరీక్ష రాయకుండా అడ్మిషన్లు కావాలని వస్తారని, అలా అడ్మిషన్ పొందే అవకాశం ఉండదన్నారు. ఈ నెల 3న దరఖాస్తుకు చివరి అవకాశమని, 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ హాస్టళ్లలో 4680 సీట్లకు అన్ని వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మెట్ల శంకర్ తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామన్నారు. కార్యక్రమంలో గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జోనల్ అధ్యక్షుడు భిక్షపతి, స్వేరోస్ సర్కిల్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, టీజీపీఏ నాయకులు భూపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, డీపీఎఫ్ నాయకులు వినయ్, భీమ్శేఖర్, కిరణ్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
రేపటి నుంచి పంజాబ్ మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం
వైర్లెస్ స్పీకర్, ఫేస్ మసాజర్లో దొంగ బంగారం..!