బెజ్జంకి : రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బుధవారం మండల కేంద్రంతోపాటు, పెరుకబండ, కల్లెపల్లి, బేగంపేట, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్లు, విగ్రహాలను, హైమాస్లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ నిర్వహణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలు చదును చేసి, విద్యుద్ధీపాల ఏర్పాటు తదితర మౌలిక వసతులను కల్పించామన్నారు.
అనంతరం మండల కేంద్రంతోపాటు, బేగంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాతలను ఆయన దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, సర్పంచులు మంజుల, సరోజన, బాపురెడ్డి, సంజీవరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజయ్య, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.