మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. మరీముఖ్యంగా విశ్వనగరంలో ఎవరికి వారుగా కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. దీంతో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోని సంక్షేమ సంఘాలు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అపార్ట్మెంటులో ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి, జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నాయి. కుటుంబంలో ఒకరికి వస్తే, ఆ కుటుంబ సభ్యులు చూసుకునే అవకాశం ఉంటోంది. కానీ కొన్ని అపార్టుమెంట్లలోని ఫ్లాట్లలో ఉండే వారికి పాజిటివ్ వస్తే వారికి అసోసియేషన్ తరపున సహాయ సహకారాలు అందేలా సభ్యులు చూస్తున్నారు. అత్యవసరం ఉన్న వారినే ఇండ్లలోకి అనుమతించాలని, అది కూడా కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించిన వారే లోపలికి వచ్చేలా ఆయా సంఘాలు పర్యవేక్షిస్తున్నాయి.
మొదటి దశతో పోల్చితే సెకండ్ వేవ్లో కరోనా తీవ్రత గేటెడ్ కమ్యూనిటీల్లో ఎక్కువగా ఉంది. ఒక్కో కమ్యూనిటీలో వెయ్యి నుంచి 2 వేల వరకు ఫ్లాట్లు ఉంటే అందులో 400-500 మంది దాకా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే గేటెడ్ కమ్యూనిటీల్లోని పార్కులు, జిమ్లు క్లోజ్ చేశారు. లిప్టులు, పనివాళ్లు ఉండే ప్రదేశాలు, డ్రైవర్లు ఉండే చోట ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరిని పడితే వారిని లోపలికి అనుమతించకుండా గేట్ దగ్గర మొబైల్ యాప్ ద్వారా విజిటర్లను పరిశీలిస్తున్నారు. కొందరైతే నగర శివారు ప్రాంతాల్లో ఉన్న తమ ఫామ్హౌస్లకు వెళ్లి నివాసం ఉంటున్నారు. చాలా తీవ్రంగా ఉన్న సెకండ్ వేవ్ కరోనాను కట్టడి చేయాలంటే ఒక వారం పాటు కచ్చితమైన నిబంధనలతో లాక్డౌన్ విధించాలి. అప్పుడే వైరస్ చైన్ కట్ అవుతుందని నా అభిప్రాయం. – రవి వర్మ, రెయిన్బో విస్టా గేటెడ్ కమ్యూనిటీ