సూర్యాపేట, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో సాగుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనే భయాందోళనల మధ్య.. అసలు కొనుగోలు కేంద్రాలు ఉంటాయా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకరించినా.. లేకపోయినా పండించిన ధాన్యం కొనుగోలు చేసి తీరుతామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సన్నాహాక సమావేశాలు నిర్వహించి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధమయ్యారు.
ఉమ్మడి జిల్లాలో 941 కొనుగోలు కేంద్రాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 941 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సూర్యాపేటలో 316, నల్లగొండలో 355, యాదాద్రి భువనగిరి జిల్లాలో 270 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. సూర్యాపేటలో ఐకేపీ 188, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 123 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లాలో ఐకేపీ 191, పీఏసీఎస్ 157, మార్కెటింగ్ శాఖ ద్వారా 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోళ్ల ప్రారంభానికి ముందే వేయింగ్ మిషన్లు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులను సిద్ధం చేశారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
గతేడాదితో పోల్చితే ఈ సారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నాగార్జునసాగర్, డిండి, ఏఎమ్మార్పీ, మూసీ ప్రాజెక్టుల నుంచి అవసరమైనంత నీటిని విడుదల చేస్తుండడంతో ఆయకట్టుకు ఢోకా లేకుండా పోయింది. ఈ సారి యాసంగిలో సూర్యాపేట జిల్లాలో రికార్డు స్థాయిలో 4,26,730 ఎకరాల్లో వరి సాగై జిల్లా సాగు విస్తీర్ణంలో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లాలో సుమారు 10,58, 290 మెట్రిక్ టన్నుల ధాన్యం పండనుండగా రైతులు తమ అవసరాలు, విత్తనాల కోసం ఉంచుకొని మిగతా 8,35,986 మెట్రిక్ టన్నులు విక్రయించే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సివిల్ సప్లయ్ సంస్థ ద్వారా 6,26,990 మెట్రిక్ టన్నులు, మిల్లర్లు 2,08,996 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో 9.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుండగా వీటిలో 2లక్షల మెట్రిక్ టన్నులను మిల్లర్లు కొనుగోలు చేసే అంచనా ఉండగా మిగిలిన ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 4.80 లక్షల ధాన్యం ఉత్పత్తి కానుండగా వాటిని కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
సందర్శించనున్న మంత్రులు
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట నడిబొడ్డున పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న అధునాతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మత్రి జగదీశ్రెడ్డితో కలిసి పరిశీలించనున్నారు. ఈ మార్కెట్ నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా తుది మెరుగులు దిద్ది త్వరలోనే ప్రారంభించనున్నారు. వందలాది మంది చిరు వ్యాపారులకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరంగా మారనుంది.
ఇవీ కూడా చదవండి…