రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. డి.సురేష్బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర టీజర్ను గురువారం అగ్ర నటుడు చిరంజీవి విడుదల చేశారు. ‘ఆధిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు..తారతమ్య గోడలనే పెకిలించగ ఎన్నినాళ్లు..దున్నెటోడి వెన్నువిరిచి భూస్వాములు ధనికులైరి’ అంటూ రానా విప్లవ కవిత్వం చదువుతుండగా టీజర్ ఆరంభమైంది.
‘ప్రియమైన అరణ్య.. నేను నీకు అభిమాని అయిపోయాను. నీ కవిత్వం చదువుతుంటే నాలో తెలియని భావోద్వేగం రగులుతోంది. మీరాబాయి కృష్ణుడి కోసం కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను వదిలి ఎలా వెళ్లిపోయిందో అలా నేను నీ కోసం వస్తున్నాను. నేనిప్పుడు ఎరుపురంగు పులుముకున్న సీతాకోకచిలకను..నీకోసం ఇప్పటికిప్పుడు చచ్చిపోయినా ఫర్వాలేదనిస్తోంది..ప్రేమకింత శక్తి ఉందా’ అంటూ సాయిపల్లవి వాయిస్ ఓవర్తో చూపించిన సన్నివేశాలు ఆకట్టుకునేలా సాగాయి. ప్రియమణి, నందితాదాస్, నివేదాపేతురాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, సంగీతం: సురేష్ బొబ్బిలి, రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల.