200 రెట్లకుపైగా ఐపీవో సబ్స్క్రిప్షన్
చివరి రోజు విశేష స్పందన
న్యూఢిల్లీ, మార్చి 5: హైదరాబాద్కు చెందిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దుమ్మురేపింది. ఈ రూ.597 కోట్ల పబ్లిక్ ఇష్యూ శుక్రవారంతో ముగిసిపోగా.. చివరి రోజున మదుపరుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ కనిపించింది. దీంతో ఏకంగా 200 రెట్లకుపైగా బిడ్లు దాఖలయ్యాయి. 72.6 లక్షల ఈక్విటీ షేర్లకుగాను 145.79 కోట్ల షేర్లకు సరిపడా బిడ్లు రావడం గమనార్హం. 200.79 రెట్లు సబ్స్క్రిప్షన్ జరిగినట్లు ఎక్సేంజీలు ప్రకటించాయి. కాగా, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లకు 28.4 రెట్లు అధికంగా బిడ్లు నమోదయ్యాయి. అలాగే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ విభాగంలో 165 రెట్లు, నాన్-ఇనిస్టిట్యూషనల్ కేటగిరీలో 650.79 రెట్ల స్పందన వచ్చింది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సంస్థ రూ.179 కోట్ల నిధులను సమీకరించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఐపీవోలో నూతన కేటాయింపు కింద రూ.123.52 కోట్ల విలువైన 21 లక్షల 48,149 ఈక్విటీ షేర్లను జారీ చేశారు. అలాగే ఆఫర్ ఫర్ సేల్ కింద 82 లక్షల 24,270 వరకు ఈక్విటీ షేర్లను అమ్మకానికి తెచ్చారు. వీటి విలువ రూ.473 కోట్లు. ఈ ఐపీవో ధరల శ్రేణి ఒక్కో షేర్కు రూ.574-575గా ఉన్నది. నిజానికి తొలిరోజైన బుధవారమే మొత్తం షేర్లు అమ్ముడైపోవడం గమనార్హం.