Sowmya Swaminathan | ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ నెల 30న తన పదవికి రాజీనామా చేయనున్నారు. డబ్ల్యూహెచ్వోలో ఐదేండ్లు పని చేసిన తర్వాత తిరిగి భారత్కు వచ్చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 63 ఏండ్ల వయస్సులో ఉన్న సౌమ్య స్వామినాథన్ రిటైర్మెంట్ వయస్సు కంటే రెండేండ్లు ముందుగానే వైదొలుతుండటం గమనార్హం. ప్రాక్టికల్ వర్క్ చేయడానికి చాలా మంది అవసరం అని ఆమె చెప్పారు. తాను ఎల్లవేళలా భారత్లో పని చేస్తూ జీవించాలనే కోరుకుంటానని అన్నారు.
`ఐదేండ్లు అంతర్జాతీయ స్థాయిలో పని చేశాక, నేను వెనక్కు రావాలని కోరుకుంటున్నా. రీసెర్చ్ అండ్ పాలసీలో మరింత మంది అవసరం. నా ఆలోచనలు, భావాలను డబ్ల్యూహెచ్వోలో ప్రమోట్ చేయడం ద్వారా నిజం చేసుకున్నా. నేను చాలా మంది అపురూపమైన వ్యక్తులను కలుసుకున్నా. పలు మంచి ఆలోచనలు (ఐడియాలు) బయటకు వచ్చాయి. భారత్లో పలు అంశాల్లో భాగస్వామి కావాలని భావిస్తున్నా` అని సౌమ్య స్వామినాథన్ తెలిపారు.
`భారత్లో ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నా. ఈ పరివర్తనలో భాగస్వామి కావాలని కోరుకుంటున్నా, భారత్ వంటి దేశాల్లో వివిధ సామాజిక వర్గాలకు సాధికారత కల్పిస్తూ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలను శక్తిమంతంగా నిర్మించాల్సి ఉంటుంది. నేను ఎల్లవేళలా భారత్లోనే పని చేస్తూ జీవించాలని కోరుకుంటాను. విదేశాల్లో ఏ అవకాశం వచ్చినా.. కొద్ది కాలం మాత్రమే కేటాయిస్తా` అని స్వామినాథన్ పేర్కొన్నారు.
క్షయ, హెచ్ఐవీల్లో పరిశోధనలతో డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. 2017లో డబ్ల్యూహెచ్వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (కార్యక్రమాలు)గా బాధ్యతలు స్వీకరించారు. డబ్ల్యూహెచ్వో ప్రత్యేకంగా సైన్స్ డివిజన్ ఏర్పాటు చేసిన తర్వాత సంస్థ తొలి చీఫ్ సైంటిస్ట్గా నియమితులయ్యారు. డబ్ల్యూహెచ్వోలో బాధ్యతలు చేపట్టక ముందు రెండేండ్ల పాటు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్గా సేవలందించారు. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత.. దాని నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో డబ్ల్యూహెచ్వో సైన్స్ డివిజన్ కీలక పాత్ర పోషించింది.