ముంబై: ఫేస్బుక్కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్( WhatsApp ) ఈ ఏడాది తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్( privacy policy update ) అమలును మళ్లీ వాయిదా వేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఈ పాలసీని అమలు చేయాలని వాట్సాప్ తొలుత భావించినా వినియోగదారుల నుంచి విమర్శలు రావడంతో కొత్త పాలసీ అమలును 3 నెలలు పాటు వాయిదా వేసింది. మే 15 నుంచి అమలు చేస్తామని ఆనాడే వెల్లడించింది.
అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని కూడా మరోసారి వాయిదా వేసింది. కొత్త పాలసీని అప్డేట్ చేయకున్నా మే 15 నుంచి ఏ అకౌంట్లను నిలిపివేయబోమని స్పష్టం చేసింది. ఖాతాలను తొలగించేది లేదని వాట్సాప్ హామీ ఇచ్చింది. ఐతే వాట్సాప్ కొత్త నిబంధనలు అంగీకరించకపోతే వాట్సాప్ సేవలను మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేరు. యూజర్లు కాల్స్, నోటిఫికేషన్లను మాత్రమే పొందగలుగుతారు. గతంలో మాదిరిగానే టెక్స్ట్, వీడియో కాలింగ్తో సహా అన్ని ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
రాబోయే రోజుల్లోనూ రిమైండర్లతో కొత్త పాలసీపై అవగాహన కల్పిస్తామని వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. కొత్త నిబంధనలు అంగీకరించినంత మాత్రాన యాప్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవని వివరించింది. వాట్సాప్ కొత్త పాలసీని చాలా మంది యూజర్లు ఇప్పటికే అంగీకరించారని,
మరికొంత మందికి ఇంకా ఆ అవకాశం రాలేదని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. సాధారణ యూజర్లకు సంబంధించి ఎలాంటి మార్పులు లేవని, వాట్సాప్తో బిజినెస్ చేసేవారికే ఆ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.