వాషింగ్టన్: ఇన్నాళ్లూ అంతరిక్షం అంటే కేవలం ఆస్ట్రోనాట్ల కోసమే అనుకునే వాళ్లం. కానీ వర్జిన్ గెలాక్టిక్లంటి కంపెనీలు ఇప్పుడు సాధారణ పౌరులను కూడా స్పేస్లోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. ఈ మధ్యే ఆ సంస్థ చీఫ్ రిచర్డ్ బ్రాన్సన్తోపాటు మన తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సంగతి తెలుసు కదా. అయితే ఈ స్పేస్ ట్రావెల్ చాలా ఖర్చుతో కూడుకున్న పని. వర్జిన్ గెలాక్టికే ఒక్కో టికెట్కు రెండున్నర లక్షల డాలర్లు వసూలు చేస్తోంది. కుబేరులకు తప్ప ఇది మామూలు వ్యక్తులు భరించలేని ఖర్చు. అలాంటి వాళ్లను కూడా ఫ్రీగా స్పేస్లోకి పంపే ఏర్పాట్లు చేస్తోంది వర్జిన్ గెలాక్టిక్. ఒమేజ్ అనే ఓ చారిటీ సంస్థతో కలిసి ఇద్దరిని ఉచితంగా పంపాలని నిర్ణయించింది. దీనికోసం ఓ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు.
అసలేంటీ కాంటెస్ట్? ఎలా పాల్గొనాలి?
Omaze.com వెబ్సైట్లోకి వెళ్లి ఎవరైనా ఈ కాంటెస్ట్లో పాల్గొనవచ్చు. ఇందులో సపోర్ట్ స్పేస్ ఫర్ హ్యుమానిటీ అండ్ ఎంటర్ ఫర్ యువర్ చాన్స్ టు విన్ అనే పేజ్ ఉంటుంది. ఇందులోకి వెళ్లి మీకు నచ్చినంత విరాళంగా ఇవ్వొచ్చు. అయితే డొనేషన్లు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదని వెబ్సైట్ చెబుతోంది. మీ వివరాలన్నింటినీ నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
ఈ నెల 11నే దీనికోసం ఎంట్రీలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 1 వరకూ ఇవి కొనసాగుతాయి. విజేతను సెప్టెంబర్ 29న ప్రకటిస్తారు. 2022 మొదట్లో విజేతను అంతరిక్షంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఒమేజ్ వెబ్సైట్ వెల్లడించింది. ఇందులో పాల్గొనే వాళ్లు కనీసం 18 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.
విజేతకు వర్జిన్ గెలాక్టిక్ స్పేస్షిప్టూలో రెండు సీట్లు కేటాయిస్తారు. విజేతతోపాటు వారి వెంట ఓ అతిథికి కూడా అవకాశం కల్పిస్తారు. అంతకుముందు సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ శిక్షణ కూడా ఇస్తారు. ఈ కాంటెస్ట్ ద్వారా విరాళాల సేకరణను వేగవంతం చేయడంతోపాటు స్పేస్లోకి వెళ్లాలన్న వారి కలను కూడా నిజం చేయడానికి ఒమేజ్ నడుం బిగించింది.