Twitter | ట్విట్టర్ చీఫ్ ఎలన్మస్క్ సంస్థ ఆదాయం పెంచే పేరుతో యూజర్లకు చుక్కలు చూపుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ బ్లూ బ్యాడ్జీ వెరిఫికేషన్ పేరిట నెలకు ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి ఎనిమిది డాలర్లు, ఐఓఎస్ యూజర్ల నుంచి 11 డాలర్ల సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేస్తున్నారు. తాజాగా బిజినెస్ ఖాతాదారులకు ఆ సెగ తాకింది.
ట్విట్టర్ గోల్డ్ బ్యాడ్జి కోసం నెలకు ఏకంగా 1000 డాలర్లు వసూలు చేయాలని తీర్మానించారు. ఈ బిజినెస్ ఖాతాల అనుబంధ అకౌంట్లకు అదనంగా 50 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంగతి సంబంధిత బిజినెస్ అకౌంట్ హోల్డర్లకు ఈ-మెయిల్ సమాచారం పంపారు. అంతే కాదు.. ఇప్పటికే గోల్డ్ బ్యాడ్జి పొందిన బిజినెస్ ఖాతాదారులు సబ్స్క్రిప్షన్ తీసుకోకుంటే.. ఆ బ్యాడ్జి హోదా కోల్పోతారని కూడా ఈ-మెయిల్ సందేశంలో తేల్చి చెప్పారు.ట్విట్టర్ కన్సల్టెంట్ మాట్ నవర్రా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ సంగతి వెల్లడించారు.
గతేడాది డిసెంబర్లోనే యూజర్లు, వారి అవసరాల ఆధారంగా లేబుల్స్, బ్యాడ్జిలు ఇస్తామని ట్విట్టర్ ప్రకటించింది. బిజినెస్ ఖాతాలకు గోల్డ్, ప్రభుత్వ ఖాతాలకు గ్రే బ్యాడ్జి, ప్రముఖులకు బ్లూ బ్యాడ్జి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే, సంస్థను దివాళా ప్రక్రియ నుంచి కాపాడేందుకు గత మూడు నెలల్లో తీవ్రంగా కష్ట పడాల్సి వచ్చిందని ఆదివారం మస్క్ ట్వీట్ చేశారు.
గోల్డ్ బ్యాడ్జి సబ్స్క్రిప్షన్ పొందిన బిజినెస్ యూజర్ల ట్వీట్లు ఎక్కువ మందికి చేరే విధంగా బూస్టింగ్ సర్వీస్ అందిస్తామని ట్విట్టర్ వెల్లడించింది. సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే యూజర్లు వెరిఫికేషన్ బ్యాడ్జి కోల్పోతారన్న విషయమై అధికారికంగా వెల్లడించలేదు. కానీ, బిజినెస్ యూజర్లకు మాత్రమే బ్యాడ్జి సబ్స్క్రిప్షన్ ఈ-మెయిల్స్ వస్తున్నాయని సమాచారం.