న్యూయార్క్ : ఎలన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన అనంతరం మాస్ లేఆఫ్స్కు తెగబడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సగానికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు మస్క్ సన్నాహాలు చేపట్టగా అందుకు అనుగుణంగా వేలాది మంది ఉద్యోగులను సాగనంపుతూ ఈమెయిల్స్ పంపే ప్రక్రియ ప్రారంభమైంది.
ఈమెయిల్స్ అందుకున్న ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ట్విట్టర్తో ఏండ్ల అనుబంధానికి తెరపడిందని కంపెనీని వీడుతూ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఉన్నపళంగా ఉద్యోగులను తొలగిస్తుండటంపై ట్విట్టర్కు వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయించారు.
ట్విట్టర్పై శాన్ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా నమోదైందని బ్లూమ్బర్గ్ న్యూస్ శుక్రవారం వెల్లడించింది. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా ఫెడరల్, కాలిఫోర్నియా చట్టాలకు విరుద్ధంగా కంపెనీ ఉద్యోగులను తొలగిస్తోందని ట్విట్టర్ ఉద్యోగులు వాపోతున్నారు. కాగా మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టగానే సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా కీలక ఎగ్జిక్యూటివ్లను తొలగించారు.