Twitter @ Musk | ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్ను గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా-స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్మస్క్ సొంతం చేసుకున్నారు. మస్క్ చేసిన ఆఫర్ మేరకు 54.20 డాలర్లకు ఒక షేర్ చొప్పున 44 బిలియన్ల డాలర్ల ఒప్పందాన్ని ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. ట్విట్టర్ను టేకోవర్ చేసుకోవడానికి 46.5 బిలియన్ డాలర్ల నిధులు సిద్ధం చేసుకోవడంతోపాటు నేరుగా వాటాదారులతో ఎలన్మస్క్ సంప్రదింపులు జరుపడంతో ట్వట్టర్ బోర్డు దిగి వచ్చింది. ఆయనతో సోమవారం చర్చించింది. ట్విట్టర్ను టేకోవర్ చేసుకోవడానికి ఆరు నెలలు పడుతుందని సంస్థ చైర్మన్ బ్రెట్ టేలర్, సీఈవో పరాగ్ అగర్వాల్ చెప్పారు.
ట్విట్టర్ టేకోవర్ ఒప్పందం ఖరారు కావడంతో సంస్థ సిబ్బందితో జరిగిన సమావేశానికి చైర్మన్ బ్రెట్ టేలర్, సీఈవో పరాగ్ అగర్వాల్లతోపాటు కొత్త యజమాని ఎలన్మస్క్, మాజీ సీఈవో జాక్ డోర్సీ హాజరు కావాల్సి ఉంది. కానీ ఎలన్ మస్క్, జాక్ డోర్సీ గైర్హాజరయ్యారు. సిబ్బందితో జరిగిన సమావేశంలో పరాగ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ట్విట్టర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్నదని, మున్ముందు సోషల్ మీడియా సంస్థ భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడం ఖాయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కీలక పరిస్థితుల్లో సిబ్బంది ఉద్వాసనలు ఉండబోవని హామీ ఇచ్చారు.
ట్విట్టర్ను టేకోవర్ చేయడానికి ఎలన్మస్క్ ప్రయత్నిస్తున్నప్పటి నుంచి సోషల్ మీడియా సంస్థ ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తుతున్నది. కొందరు ఉద్యోగులైతే ట్విట్టర్లోనే తమ నిరసన వెళ్లగక్కారు. కానీ, మార్పు తధ్యం అని సోమవారం నాడే ఉద్యోగులకు పరాగ్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు.
వాక్ స్వాతంత్య్రాన్ని బలోపేతం చేయడానికే ట్విట్టర్ను టేకోవర్ చేయాలని భావించినట్లు ఎలన్మస్క్ చెప్పారు. ఇప్పటి వరకు ట్విట్టర్ తన లక్ష్యాలకు భిన్నంగా పని చేస్తూ వచ్చిందని విమర్శలు గుప్పించారు. ట్విట్టర్లో వాటాదారుగా మారితే మార్పు తేవచ్చునన్న భావనతో ఇటీవలే 9.2 శాతం (2.9 బిలియన్ డాలర్లు) వాటాలు కొన్నారు. దీంతో డైరెక్టర్గా నియమితులయ్యే చాన్స్ పొందారు. కానీ ఆ హోదా తీసుకుంటే నిర్దిష్ట శాతానికి మించి వాటా కొనే అవకాశం లేక డైరెక్టర్ హోదాను తిరస్కరించారు. అటుపై ట్విట్టర్నే టేకోవర్ చేస్తానని ప్రతిపాదించారు.