Chatbot FoodOrder in Railways | రైల్వే ప్రయాణికులు త్వరలో వాట్సాప్ నంబర్ ద్వారా తమకు ఇష్టమైన, రుచికరమైన భోజనం ఆర్డర్ చేయొచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ).. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్బోట్ను అందుబాటులోకి తెస్తున్నది. ఈ చాట్బోట్పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేయొచ్చు. ఇప్పటికే కొన్ని నిర్దిష్ట రూట్లలో ఐఆర్సీటీసీ.. +91 8750001323 ఫోన్ నంబర్పై వాట్సాప్ ద్వారా మీల్స్ అందిస్తున్నది.
ఈ ఫోన్ నంబర్ వాట్సాప్ ద్వారా మీల్స్ ఆర్డర్ మెసేజ్ పెట్టిన ప్రయాణికులకు భోజనం అందిస్తున్నది. `ప్రయాణికుల సూచనలు, ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికుల ఈ-కేటరింగ్ సర్వీసులకు వాట్సాప్ కమ్యూనికేషన్ అందుబాటులోకి తెచ్చాం. మరికొన్ని రైళ్లలో ఈ సదుపాయం కల్పిస్తుంది` అని భారతీయ రైల్వేస్ సోమవారం ఓ ప్రకటన చేసింది.
ఈ-కేటరింగ్ సర్వీసుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్సైట్ www.catering.irctc.co.in ద్వారా, ఈ-కేటరింగ్ యాప్ `ఫుడ్ ఆన్ ట్రాక్` ద్వారా భోజన వసతి కల్పిస్తున్నది. వాట్సాప్ ద్వారా ఈ-కేటరింగ్ సర్వీసులు రెండు దశల్లో అమలు చేస్తుంది. ఇప్పటికే తొలి దశలో ప్రయాణికులకు భోజన వసతి కల్పిస్తున్నారు.
ప్రయాణికులు www.catering.irctc.co.in వెబ్సైట్లోని ఈ-కేటరింగ్ సర్వీసుల ఆప్షన్తో ఈ-టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. వారి మొబైల్ నంబర్కు ఒక బిజినెస్ వాట్సాప్ నంబర్ ద్వారా మెసేజీ వస్తుంది. ఈ వాట్సాప్ నంబర్పై ప్రయాణికులు తమకు సంబంధిత రూట్లోని స్టేషన్ల పరిధిలో అందుబాటులో ఉన్న రెస్టారెంట్ల నుంచి తమకు ఇష్టమైన మీల్స్ బుక్ చేసుకోవచ్చు.
రెండో దశలో ఇంటరాక్టివ్ వాట్సాప్ మీల్ బుకింగ్, డెలివరీకి భారతీయ రైల్వేస్ ప్రణాళిక రూపొందించాయి. ఇందులో వాట్సాప్ నంబర్.. తమ కస్టమర్కు ఇంటరాక్టివ్ టూ వే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి తెస్తుంది. తమకు అవసరమైన మీల్ను ఏఐ-పవర్డ్ చాట్బోట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి రోజూ ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సర్వీస్ వెబ్సైట్, యాప్ ద్వారా దాదాపు 50 వేల మందికి భోజనం డెలివరీ చేస్తున్నారు.