భువనేశ్వర్: ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యంగల బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సక్సెస్ఫుల్గా చేధించగలదు. అదేవిధంగా 500 కేజీల నుంచి 1000 కేజీల వరకు బరువును మోసుకెళ్లగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం.
ఈ ప్రళయ్ క్షిపణి ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇండియన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్లో భాగంగా రూపొందించిన పృథ్వి డిఫెన్స్ వెహికిల్ను ఆధారంగా చేసుకుని ఈ ప్రళయ్ క్షిపణిని రూపొందించారు. ఉదయం 10.30 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ క్షిపణిని పరీక్షించారు. కాగా, క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో బృందాన్ని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.