ఎక్కడ చూసినా ఎముకల గూళ్లు.. ఎంత దూరం వెళ్లినా.. అవశేషాలు, పుర్రెలు, అస్థిపంజరాలు. కుప్పలు కుప్పలుగా సుమారు 1.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఎక్కడ చూసినా అవే. ఇన్ని రోజులు ఎవ్వరూ అటువైపు కూడా వెళ్లకపోవడంతో.. అక్కడ కుప్పలు కుప్పలుగా ఎముకలు పడి ఉన్నాయని ఎవ్వరికీ తెలియదు. కానీ.. తాజాగా.. వాటి గురించి ప్రపంచానికి తెలిసింది.
దాదాపు 7000 ఏళ్ల క్రితం నాటి మనుషుల, జంతువుల అవశేషాలను అక్కడ కనుగొన్నారు. అది కూడా ఒక గుహలో. సౌదీ అరేబియాలోని లావా ట్యూబ్ ఉమ్ జిర్సన్ అనే ఓ గుహలో ఇవన్నీ వెలుగు చూశాయి. అప్పట్లో వేల సంవత్సరాల క్రితం.. అగ్నిపర్వతం బద్దలు అయి దాంట్లో నుంచి లావా బయటికి వచ్చి.. ఆ గుహ ఏర్పడిందట. అందుకే దాన్ని లావా ట్యూబ్ అని పిలుస్తారు. అదే గుహలో ఇప్పుడు వీటిని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. ఆ ఆవశేషాలలో 7 వేల ఏళ్ల క్రితం నాటి హైనా అనే జంతువులవి కూడా ఉన్నాయట.
గుర్రాలు, ఒంటెలు, ఆవులు, ఇతర జంతువులతో పాటు, మనుషుల పుర్రెలు, అస్థిపంజరాలను కూడా ఆ గుహలో గుర్తించారు. ఆ గుహలో దొరికిన వాటిలో కొన్ని శాంపిల్స్ తీసుకొని రేడియో కార్బన్ అనే టెస్ట్ నిర్వహించగా… అవి 439 నుంచి 6839 సంవత్సరాల మధ్య జీవించిన మనుషులు, జంతువుల అవశేషాలుగా అధికారులు గుర్తించారు. మనుషుల అవశేషాలు వేలకొద్దీ అక్కడ ఉన్నాయట.
ఇతర జంతువులను వేటాడి చంపి తినే.. జంతువులు.. ఈ గుహనే తమ స్థావరంగా ఏర్పాటు చేసుకొని ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సౌదీలో వెలుగు చూసినట్టుగానే చెక్ రిపబ్లిక్ అనే దేశంలో కూడా కుప్పలు కుప్పలుగా అవశేషాలను గుర్తించారు. కానీ.. వాటిని 1942లోనే గుర్తించారు.