Allu Sirish | టాలీవుడ్లో పెళ్లి సందడి నెలకొంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, యువ నటుడు అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. వివాహానికి ముందు జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. పెళ్లికొడుకు వేడుకలో వరుడికి పసుపు రాయడం, పెద్దల ఆశీర్వాదాలు అందించడం వంటి సంప్రదాయ ఆచారాలు నిర్వహించారు. కుటుంబానికి చెందిన పెద్దలు, బంధువులు శిరీష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుక అంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అర్జున్ తన సోదరుడికి ఆశీస్సులు అందించగా, రామ్ చరణ్-ఉపాసన దంపతులు, సాయి ధరమ్ తేజ్, నిహారిక, సురేఖ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
వేడుకలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయనకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకున్న కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మిక మంధాన కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ జంట వేడుకలో సెంట్రాఫ్ అట్రాక్షన్గా మారింది. అల్లు కుటుంబంతో విజయ్, రష్మికలకు ఉన్న అనుబంధం మరోసారి స్పష్టమైంది. గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిన గీతా గోవిందంలో విజయ్–రష్మిక జంటగా నటించారు. అదే సమయంలో రష్మిక, అల్లు అర్జున్తో కలిసి పుష్ప: ది రైజ్, పుష్ప2: ది రూల్ చిత్రాల్లో నటించారు.
ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా హాజరైనట్లు సమాచారం. అల్లు అరవింద్–బాలయ్య మధ్య ఉన్న అనుబంధం తెలిసిందే. ఇక అల్లు శిరీష్ – నయనిక వివాహ వేడుక మార్చి 6న గ్రాండ్గా జరగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారని సమాచారం. హీరోగా పలు చిత్రాల్లో నటించిన శిరీష్, తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు. మొత్తానికి, అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుకలో మెగా కుటుంబం సందడి చేయగా, విజయ్–రష్మిక హాజరు కావడం కూడా వేడుకని ప్రత్యేకంగా మార్చింది. అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.