Elon Musk | రెండు నెలల క్రితం ట్విట్టర్ను టేకోవర్ చేసిన తర్వాత సగానికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ తీసుకున్న నిర్ణయం సమంజమేనని ఆ సంస్థ న్యూ బాస్ ఎలన్మస్క్ సమర్థించుకున్నారు. ట్విట్టర్ ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు తాను తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయని చెప్పారు. ఖర్చులను నియంత్రించడానికి తాను చేపట్టిన చర్యలతో వచ్చే ఏడాది నాటికి ట్విట్టర్ ఆర్థికంగా గాడిన పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ట్విట్టర్ యూజర్లతో జరిగిన చిట్చాట్లో ఎలన్మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం అదుపు తప్పి నేల కూలుతున్న విమానం మాదిరిగా ట్విట్టర్ పరిస్థితి ఉందని ఎలన్ మస్క్ చెప్పారు. ఉద్యోగుల ఉద్వాసన వంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే ఏటా ట్విట్టర్ 300 కోట్ల డాలర్లు నష్టపోవాల్సి వచ్చేదన్నారు. అందుకే ఐదువారాలుగా ట్విట్టర్లో ఖర్చులను తగ్గించడానికి పిచ్చోడిగా పని చేశానన్నారు. ఖర్చుల నియంత్రణ, సబ్స్క్రైబర్ల ఆదాయం పెంపు వ్యూహంతోనే ముందుకెళ్లానన్నారు.
వాణిజ్య ప్రకటన దారులు ట్విట్టర్పై ఖర్చు చేసేందుకు వెనుకంజ వేస్తున్న సంగతి తనకు స్పష్టంగా అర్థమైందని ఎలన్మస్క్ పేర్కొన్నారు. కానీ, ట్విట్టర్లో కంటెంట్ పరమైన మార్పు చేసినందుకు వారు ఆందోళన చెందడం లేదన్నారు. కేవలం ట్విట్టర్ ఆర్థిక భవితవ్యంపైనే ప్రకటనదారులు ఆందోళనకు గురయ్యారని చెప్పారు.
తాను ఎనిమిది డాలర్లతో తెచ్చిన `ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్` ఖచ్చితంగా సత్ఫలితాన్నిస్తుందని ఎలన్మస్క్ అన్నారు. అలా చేయకపోయి ఉంటే బిల్లులు చెల్లించడం కూడా ట్విట్టర్కు కష్టమయ్యేదని చెప్పారు. కేవలం హార్డ్వేర్ కోసమే ట్విట్టర్ సంవత్సరానికి 150 కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్నదని తెలిపారు.
అక్టోబర్లో ట్విట్టర్ను టేకోవర్ చేశాక ఎలన్మస్క్ పలు మార్పులు తెచ్చారు. పొదుపు చర్యల్లో భాగంగా భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ట్విట్టర్ బ్లూ టిక్ సేవలకు చార్జీ వసూలు చేయడం మొదలు పెట్టారు. సబ్స్క్రైబర్లకు వెరిఫికేషన్ బ్యాడ్జితోపాటు స్పెషల్ సర్వీస్ అందిస్తున్నారు. అఫిషియల్ ఖాతాలను గుర్తించడానికి మూడు వెరిఫికేషన్ బ్యాడ్జీలు తెచ్చారు. ప్రభుత్వ సంస్థలకు గ్రే, కంపెనీలకు గోల్డ్, వ్యక్తులకు బ్లూ టిక్ ఇస్తున్నారు. ఇక ట్విట్టర్లో నైతికత అంశాలను పర్యవేక్షించే సేఫ్టీ కౌన్సిల్ అనే ఇండిపెండెంట్ వ్యవస్థను రద్దు చేశారు.
కాగా, ట్విట్టర్ సీఈవోగా సరైన వ్యక్తి దొరికితే తాను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటానని మస్క్ ప్రకటించారు. ఈ విషయమై తానే స్వయంగా ట్విట్టర్లో నిర్వహించిన ఓటింగ్లో 57.5 శాతం ఎలన్మస్క్.. ట్విట్టర్ సీఈవోగా వైదొలగాలని సూచించారు. ఓటింగ్ ఫలితానికి కట్టుబడి ఉంటానన్నారు మస్క్.