Tech News | దివ్యాస్ర్తాలు సంపాదిస్తే సరిపోదు.. వాటిని యుక్తిగా ప్రయోగించే నేర్పూ, ఓర్పూ రెండూ ఉండాలి. నేటి యుగంలో సోషల్ మీడియాను మించిన బ్రహ్మాస్త్రం లేదు. దీన్ని సంధించిన తర్వాత ఉపసంహరించడం ఉండదని గుర్తుంచుకోవాలి. ఆగ్రహావేశాలకు గురై ఈ అస్ర్తాన్ని ప్రయోగిస్తే.. మహాభారతంలో అశ్వత్థామలా అపకీర్తిని మూటగట్టుకోక తప్పదు. తెలివితేటలు ఉన్నా విషయంపై స్పష్టత కొరవడితే.. సవ్యసాచి కుడియెడమైన తీరుగా తయారవుతుంది పరిస్థితి. ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గుతామో తెలుసుకోవాలి. ఇంతకీ సామాజిక మాధ్యమాల్లో ఎక్కుపెట్టే అక్షర తూణీరాలు ఎలా ఉండాలంటే..
‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడు’ అన్నది పాత సామెత. ఒక మనిషి గుణగణాలు, వ్యవహారశైలి ఆ వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్లు చూసి కనిపెట్టొచ్చు. సరదాగా పెట్టే స్టేటస్ కూడా మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తుంది. చేసే పోస్టులు, పెట్టే కామెంట్లు, షేరింగ్లు వీటితోపాటు అకౌంట్ మేనేజ్మెంట్ కూడా చాలా కీలకం. అదేపనిగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తూ పోకండి. వాటి ఆధారంగా మీ ఆనుపానులు తెలుసుకొని, ఇతర అవసరాలకు ఉపయోగించుకునే ప్రమాదం లేకపోలేదు.
– అనిల్ రాచమల్ల, ఎండ్నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు