Tata-I Phone | భారత్లో టెక్ దిగ్గజం ఆపిల్ ‘ఐ-ఫోన్’ల తయారీకి టాటా సన్స్ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే మనదేశంలో ఐ-ఫోన్లు తయారవుతున్నా.. విదేశీ కంపెనీలే వాటి తయారీ పనులు చేపట్టాయి. ప్రస్తుతం తైవాన్కు చెందిన కంపెనీలు ఫాక్స్కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్ వంటి సంస్థలు మనదేశంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి.. ఆపిల్ వారి ఐ-ఫోన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఐ-ఫోన్ల తయారీలో విదేశీ సంస్థలతో పోటీ పడేందుకు టాటా సన్స్ సిద్ధమైంది. ఇందుకోసం విస్ట్రోన్ సంస్థతో జరుపుతున్న సంప్రదింపులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. బెంగళూరుకు సమీపాన గల విస్ట్రోన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో మెజారిటీ వాటా దక్కించుకోవడానికి టాటా సన్స్ సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నది.
దేశీయంగా ఐ-ఫోన్ల తయారీ కార్యకలాపాలను విస్ట్రోన్ సాయంతో పూర్తిగా సొంతం చేసుకోవాలని టాటా సన్స్ గ్రూప్ యోచిస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో చైనాకు పోటీ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ ప్లాన్లకు టాటా సన్స్ చేస్తున్న ప్రయత్నాలు దన్నుగా నిలుస్తాయి. వచ్చే మార్చి నెలాఖరు నాటికి విస్ట్రోన్ సంస్థ యాజమాన్యంతో టాటా సన్స్ చర్చలు ఒక కొలిక్కి రానున్నాయని తెలియవచ్చింది. విస్ట్రోన్-టాటా మధ్య ఒప్పందం కుదిరితే మాత్రం.. టాటా సన్స్ అనుబంధ ‘టాటా ఎలక్ట్రానిక్స్’ ఆధ్వర్యంలో ఐ-ఫోన్ల తయారీ జరిగే అవకాశం ఉన్నట్లు వినికిడి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మాన్యుఫాక్చరింగ్ సెక్టార్కు కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహాలనూ టాటా సన్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయి.
తైవాన్ ఎలక్ట్రానిక్స్ మేజర్స్ ఫాక్స్ కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్లు భారతదేశంలో ఇప్పుడు ఐ-ఫోన్లు తయారు చేస్తున్నాయి. కాగా, ఆదాయం పెంపుదల కోసం విస్ట్రోన్.. సర్వర్ల తయారీ వంటి విభాగాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం మనదేశంలో ఐ-ఫోన్ల తయారీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు వినికిడి. బెంగళూరు నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోనే విస్ట్రోన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఉన్నది. విస్ట్రోన్, టాటా మధ్య డీల్ కుదిరితే.. టాటా సన్స్ చేతికి ఎనిమిది ఐపోన్ తయారీ లైన్లు చిక్కుతాయి. టాటా గ్రూప్ యాజమాన్యం పరిధిలో పది వేల మంది కార్మికులు పని చేస్తారు.
ఆపిల్ సంస్థతో టాటా సన్స్ తన సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నది. ఇప్పటికే తమిళనాడులోని హోసూర్ నగర పరిధిలో ఐ-ఫోన్లో వినియోగించే విడి భాగాలను టాటా సన్స్ తయారు చేస్తున్నది. ఇటీవలే భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వందల ఎకరాల్లో విస్తరించిన ఈ యూనిట్కే కొత్తగా ఐ-ఫోన్ తయారీ లైన్లు జత కలుపాలని యోచిస్తున్నదని తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ఆపిల్ స్టోర్లు ప్రారంభిస్తామని టాటా సన్స్ ప్రకటించింది. త్వరలో ముంబైలో తొలి ఆపిల్ స్టోర్ తెరుస్తామని ప్రకటించింది.