Tata-I Phone | ఆపిల్ ఐ-ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. చైనాలో కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత అక్కడ మాన్యుఫాక్చరింగ్ చేపట్టిన పలు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగా భారత్లో ఐ-ఫోన్ల తయారీకి ఆపిల్ సిద్ధమైంది. ఆ ఐ-ఫోన్ల తయారీలో టాటా గ్రూప్ కూడా భాగస్వామి అవుతున్నది. ఇందు కోసం వచ్చే రెండేండ్లలో ప్రత్యేకించి 45 వేల మంది మహిళా ఉద్యోగులను నియమించుకునేందుకు టాటా గ్రూప్ ప్రణాళిక సిద్ధం చేసింది. తమిళనాడులోని హోసూర్లో గల టాటా టెక్నాలజీ ఫ్యాక్టరీలో ఇప్పటికే పది వేల మంది ఉద్యోగులు ఉంటే.. వారిలో అత్యధికులు మహిళలే. గత సెప్టెంబర్లో సుమారు ఐదు వేల మంది మహిళలను నియమించుకున్నదని బ్లూంబర్గ్ వార్తా కథనం.
హొసూర్ప్లాంట్లో పని చేస్తున్న మహిళా వర్కర్లు స్థూల వేతనం రూ.16వేలకు పైగా పొందుతున్నారని ఆ వార్తాకథనం సారాంశం. ఇది ఇండస్ట్రీ యావరేజీ వేతనం కంటే 40 శాతం ఎక్కువ అని తెలిపింది. ఫ్యాక్టరీ ఆవరణలోనే వర్కర్లకు ఫుడ్, నివాస వసతి కల్పించింది టాటా ఎలక్ట్రానిక్స్. దీంతోపాటు వర్కర్లకు ట్రైనింగ్, ఎడ్యుకేషన్ అందించనున్నది. టాటా టెక్నాలజీ హొసూర్ ప్లాంట్ 500కి పైగా ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఐ-ఫోన్ల తయారీకి విస్ట్రోన్ కంపెనీతో టాటా కంపెనీ చర్చలు జరుపుతున్నది. విస్ట్రోన్ కంపెనీ జాయింట్ వెంచర్తో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ ప్రారంభించే యోచనలో ఉంది టాటా టెక్నాలజీ. ఐఫోన్ల తయారీతో టాటా టెక్నాలజీ కూడా మాన్యుఫాక్చరింగ్లోకి వచ్చేసినట్లే. విస్ట్రోన్తో టాటా గ్రూప్ ఒప్పందం ఖరారైతే.. భారత్లో ఐఫోన్ తయారు చేయనున్న దేశీయ తొలి కంపెనీగా టాటా నిలువనున్నది.