RT-PCR Kit | వర్షాకాలంలో సోకే వ్యాధులను గుర్తించేందుకు తొలిసారిగా ఆర్టీ-పీసీఆర్ కిట్ను అభివృద్ధి చేసింది. పుణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ ఈ కిట్ను తయారు చేసింది. ఒకేసారి ఏడు రకాల వ్యాధులను గుర్తించడం ఇది ప్రత్యేకత. ఈ కిట్ ద్వారా మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ, జికా సహా ఏడురకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు రెండుగంటల్లోనే వస్తాయని కంపెనీ పేర్కొంది. ఇంతకు ముందు తొలి స్వదేశీ కొవిడ్ ఆర్టీ పీసీఆర్ కిట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ను తయారు చేసిన ఘనత మైల్యాబ్కు ఉన్నది.
వర్షాకాలంలో దోమల మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా కేసులు పెరుగుతున్నాయి. మైల్యాబ్ ఫీవర్ ప్యానెల్ దీన్ని అభివృద్ధి చేయగా.. ఇది వర్షాకాలంలో వచ్చే అన్నిరకాల వ్యాధులను ఆర్టీ పీసీఆర్ కిట్తో పరీక్షిస్తుంది. మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ, జికా, లెప్టోపిరోసిస్, సాల్మొనెలోసిస్ బాక్టీరియా జాతులు, లీష్మానియాసిస్ పరాన్నజీవుల మధ్య తేడాను గుర్తించడంతో పాటు వేరు చేస్తుందని కంపెనీ పేర్కొంది. టెస్ట్కు సంబంధించిన ఫలితాలు కేవలం రెండు గంటల్లోనే వస్తాయని తెలిపింది. తద్వారా పెద్ద ఎత్తున సులభంగా పరీక్షలు నిర్వహించవచ్చని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా 17శాతం అంటువ్యాధులు వెక్టర్స్ ద్వారానే ప్రబలుతుండగా.. ఏటా 7లక్షల మంది బలవుతున్నారు.
దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్కు సైతం వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. కరోనా వ్యాక్సిన్ను తయారు చేసిన భారత్ బయోటెక్ కంపెనీ జికా వ్యాక్సిన్ను తయారీ చేసే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే హ్యుమన్ సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ను కంపెనీ ప్రారంభించనున్నది. జికా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏడిస్ జాతికి చెందిన దోమల ద్వారా సోకుతుంది. జికా వైరస్తో వచ్చే ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరం. దీంతో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులుంటాయి. గర్భిణికి ఈ ఇన్ఫెక్షన్ సోకితే అది కడుపులో పుట్టబోయే బిడ్డ మెదడుపై సైతం ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.