న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలోనూ టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ కొనసాగించడంతో ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది. ఈ-కామర్స్, హెచ్ఆర్ విభాగాల్లో 18,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ గురువారం ప్రకటించగా మరో టెక్ కంపెనీ సేల్స్ఫోర్స్ ప్రపంచవ్యాప్తంగా పలు కార్యాలయాలను మూసివేయడంతో పాటు పది శాతం ఉద్యోగులను సాగనంపనున్నట్టు వెల్లడించింది.
ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు సైతం లేఆఫ్స్ ప్రణాళికలకు పదునుపెడుతున్నాయి. వ్యయాలు పెరిగిపోవడం, రాబడి తగ్గుతుండటంతో లేఆఫ్స్ను కొనసాగించనున్నట్టు అమెరికన్ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ఫోర్స్ తెలిపింది. కరోనా అనంతరం ముమ్మరంగా హైరింగ్ చేపట్టిన కంపెనీ ఆపై ఆర్ధిక మందగమనంతో పెరిగిన ఖర్చులను భరించలేని పరిస్ధితికి చేరింది.
దీంతో ఉద్యోగులను పెద్దసంఖ్యలో తొలగించేందుకు సిద్ధమైంది. ఆర్ధిక మందగమనంతో వాణిజ్య వాతావరణం సవాళ్లతో కూడుకున్నదని, తమ కస్టమర్లు కొనుగోలు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని సేల్స్ఫోర్స్ కో సీఈఓ మర్క్ బెనియాఫ్ పేర్కొన్నారు. సేల్స్ఫోర్స్ను వీడుతున్న ఉద్యోగులకు మెరుగైన పరిహార ప్యాకేజ్తో పంపుతున్నామని, వారికి పూర్తిగా బాసటగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. అమెరికా వెలుపల కూడా ఉద్యోగాలు కోల్పోయేవారికి భరోసాగా ఉంటామని, స్ధానిక చట్టాలకు అనుగుణంగా ఆయా దేశాల్లోని ఉద్యోగులుక పరిహారం చెల్లిస్తామని తెలిపారు.