ముంబై, జూలై 6: స్పందించే రోబోట్లు.. వస్తున్నాయ్..! అవును ఇక నుంచి రోబోలకు కూడా మనిషి మాదిరిగా చర్మ స్పర్శను అందించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన పరిశోధకులు ఆ దిశగా ముందడుగు వేశారు. వీరు మనిషిలాగా చర్మ స్పర్శను కలిగించేందుకు స్మార్ట్ ఫోమ్ మెటీరియల్ను అభివృద్ధి చేశారు. దీనివల్ల రోబోట్లు మానవ చర్మంలా సమీప వస్తువులను గుర్తించగలుగుతాయి.రోబోలకు స్పర్శ కలగడానికి పరిశోధకులు సూక్ష్మ లోహ కణాలతో నింపడమేకాకుండా ఉపరితలం కింద చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చారు. అవి స్పందించేలా సెన్సార్లను అమర్చారు.కృత్రిమంగా రూపొందించిన ఫోమ్, ఫ్లోరోపాలిమర్ లను కలిపి సాగే టటువంటి పాలిమర్ ను రోబోకు అమర్చారు.
రోబోటిక్స్ ,ప్రొస్తెటిక్ పరికరాలలో,రోబోట్లు మనుషుల మధ్యలో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ రీసెర్చ్ బృందంలో ప్రధాన పరిశోధకుడైన బెంజమిన్ టీ చెప్పారు.
రోబోలకు ఒత్తిడి కలిగినప్పుడు లోహ కణాలు వాటి విద్యుత్ లక్షణాలను మారుస్తాయి. ఈ మార్పులను కంప్యూటర్కు అనుసంధానించిన ఎలక్ట్రోడ్ల ద్వారా గుర్తించవచ్చు, ఇది రోబోట్కు ఏమి చేయాలో చెబుతుందని టీ అనే పరిశోధకుడు చెబుతున్నారు.
“నేను సెన్సార్ దగ్గర నా వేలిని కదిలించినప్పుడు,సెన్సార్ నా ఎలక్ట్రికల్ మార్పులను గమనిస్తూ స్పర్శకు అనుగుణంగా స్పందించిందని ” ఆయన వివరించారు. ఈ లక్షణం రోబోట్లను మరింత తెలివిగా వ్యవహరించేలా చేస్తుంది. రోబో తనకు తానూ స్పందించే లక్షణాలు తీసుకురావడానికి ఒత్తిడి తగిలినప్పుడు గ్రహించగలిగేలా చేయడంలో స్మార్ట్ ఫోమ్ మెటీరియల్ చాలా బాగా పనిచేస్తుందని టీ పేర్కొన్నారు. ప్రస్తుతానికి రోబో చేతికి మాత్రమే స్పర్శను గ్రహించగలిగే శక్తి ఉందని, దీనిని అభివృద్ధి చేయడానికి రెండేండ్లు పట్టిందని,ఐదేండ్లలో పూర్తిస్థాయిలో రోబోలకు స్పర్శ కలిగిస్తామని టీ అతని బృందం తెలిపింది. అప్పుడు రోబోటిక్ చేతులను మరింత సహజంగా ఉపయోగించుకోడానికి వీలు కలుగుతుందని టీ వివరించారు.