TRAI to Telecom Providers | పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్స్ కోసం ఫోన్ కాల్స్ చేస్తుంటాయి.. అలా వచ్చే ఫోన్ కాల్స్తో ప్రతి ఒక్కరూ చికాకు పడుతుంటారు. ఇటువంటి అనవసర ఫోన్ కాల్స్ బెడద నుంచి కస్టమర్లకు రిలీఫ్ కల్పించేందుకు టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే టెలికం నెట్వర్క్ సంస్థల యాజమాన్యాలు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలతో పలు దఫాలు సమీక్షించింది. యూజర్లను ఇబ్బందుల పాల్జేస్తున్న క్యాంపెయిన్ మెసేజేస్, కాల్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించింది. సదరు ప్రమోషనల్ కాల్స్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై తాజాగా మరోమారు సమీక్షించింది.
ఇటువంటి ఫోన్ కాల్స్ బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థల నుంచి ఎక్కువగా వస్తాయి. వినియోగదారులను ఇబ్బంది పెట్టే అనధికార ప్రచార మెసేజ్లు, కాల్స్ ఒక్కోసారి ఫ్రాడ్, స్కామ్లకు కారణమవుతున్నాయని టెలికం సంస్థల దృష్టికి ట్రాయ్ అధికారులు తీసుకొచ్చారు. ఫ్రాడ్ మెసేజ్లను కనిపెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ ఆధారిత వ్యవస్థల టూల్స్ను ట్రాయ్ అధికారుల ముందు వొడాఫోన్ ఐడియా ప్రతినిధులు ప్రతిపాదించారు. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి వొడాఫోన్ ఐడియాకు ట్రాయ్ అనుమతి ఇచ్చింది. ప్రయోగాత్మకంగా అమలులో వచ్చే రిజల్ట్స్ ఆధారంగా తగు మార్గదర్శకాలు తీసుకొస్తామని ట్రాయ్ వివరించింది.
అనధికారిక కాల్స్, మెసేజ్ల నియంత్రణకు టెలికం సంస్థలు ముమ్మర చర్యలు చేపట్టినా.. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని ట్రాయ్ తెలిపింది. అనధికారిక క్యాంపెయిన్ మెసేజ్ల నియంత్రణకు వినియోగిస్తున్న బ్లాక్ చైన్ లింక్డ్ ..డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ).. వచ్చే మే ఒకటో తేదీ నుంచి కాల్స్కు కూడా వర్తింప చేస్తామని పేర్కొంది. డీఎల్టీ ప్లాట్ఫామ్పై రికార్డైన అన్ని హెడ్డర్లు, మెసేజ్ల టెంప్లేట్లు, వాటి వివరాలు మరోసారి ధృవీకరించుకోవాలని సూచించింది. సర్టిఫై చేయని హెడ్డర్లు, టెంప్లేట్లు 30 నుంచి 60 రోజుల్లోపు నిలిపేయాలని ఆదేశించింది. డీఎల్టీ ప్లాట్ఫామ్పై రికార్డు గానీ టెలి మార్కెటర్లు, మెసేజ్లు పంపకుండా నిషేధించాలని టెలికం సంస్థలకు ట్రాయ్ స్పష్టం చేసింది.