నెల్లూరు: నింగిలోకి దూసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ53 సిద్ధంగా ఉన్నది. ఇవాళ సాయంత్రం 6.02 గంటలకు ఆకాశంలోకి టేకాఫ్ చేసేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పీఎస్ఎల్వీ సీ53 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికి 25 గంటల కౌంట్డౌన్ బుధవారం సాయంత్రం 4.02 గంటలకు ప్రారంభమైంది.
పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన 365 కిలోల డీఎస్-ఈఓ ఉపగ్రహం, 155 కిలోల న్యూసార్, 2.8 కిలోల స్కూబ్-1 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను కమర్షియల్గా ప్రయోగించడంలో ఇస్రో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న విషయం తెలిసిందే. 2016లో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించింది. తక్కువ వాణిజ్య ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే సౌలభ్యం కారణంగా చాలా దేశాలు భారత్ నుంచి ప్రయోగించేందుకు మొగ్గు చూపుతున్నాయి.
పీఎస్ఎల్వీ సీ53 అంతరిక్ష నౌక న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ రెండవ అంకితమైన వాణిజ్య మిషన్. ఇది పీఎస్ఎల్వీ 55వ మిషన్. పీఎస్ఎల్వీ-కోర్ అలోన్ వేరియంట్ను ఉపయోగించే 15వ మిషన్. రెండో ప్రయోగ వేదిక నుంచి 16వ పీఎస్ఎల్వీ ప్రయోగం జరుగనున్నది. లాంచ్ వెహికల్ విడిపోయిన తర్వాత సైంటిఫిక్ పేలోడ్ల కోసం ఒక ప్లాట్ఫారమ్గా ఉపయోగించిన ఎగువ దశను ఉపయోగించేందుకు ఇస్రో ప్రయత్నిస్తుండటం ఈ ప్రయోగం ప్రత్యేకత.