Pegatron to India | అమెరికాతో రాజకీయ విభేదాలతో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. జీరో కరోనా పాలసీతో ఉద్యోగుల్లో నిరసన.. డ్రాగన్తో సంబంధాల తెగదెంపులకు ముందుకు వస్తున్న టెక్ దిగ్గజాలు పెరుగుతున్నాయి. అందునా ఆపిల్ ఐ-ఫోన్లు తయారు చేసే సంస్థలన్నీ.. చైనా నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే తైవాన్ ఎలక్ట్రానిక్ మేజర్ ఫాక్స్కాన్.. త్వరలో భారత్లో ఐ-ఫోన్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నది. మరో తైవాన్ సంస్థ పెగట్రాన్ కార్పొరేషన్ సైతం అదే బాటలో పయనిస్తున్నది. ఐ-ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది.
తమిళనాడులో రెండో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నది. ఆరు నెలల క్రితం చెన్నైకి సమీపాన రూ.1,236 కోట్ల వ్యయంతో తొలి ఐ-ఫోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది పెగట్రాన్. చైనా నుంచి ఐ-ఫోన్ల ఉత్పత్తిని ఇతర దేశాలకు తరలించాలని ఆపిల్ భావిస్తున్న తరుణంలో పెగట్రాన్ తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.
తమిళనాడులో రెండో ఐ-ఫోన్ల తయారీ యూనిట్ ఏర్పాటుపై పెగట్రాన్ గానీ, ఆపిల్ గానీ స్పందించలేదు. ఆపిల్ ఐ-ఫోన్ల వృద్ధికి భారత్ కేంద్రంగా కనిపిస్తున్నది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దాదాపు రూ.78,303 కోట్ల (900 కోట్ల డాలర్లు) విలువైన ఐ-ఫోన్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) మాటల్లో చెప్పాలంటే మొత్తం ఐ-ఫోన్ల సేల్స్లో 50 శాతానికి పైగా భారత్ నుంచే ఎగుమతి అయ్యాయి. భారత్లో ఐ-ఫోన్ల తయారీలో పెగట్రాన్ వాటా 10 శాతం అని రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ వెల్లడించింది. పెగట్రాన్తోపాటు భారత్లో విస్ట్రన్, ఫాక్స్కాన్ కంపెనీలు ఐ-ఫోన్లు తయారు చేస్తున్నాయి.