Elon Musk-Twitter | ఎట్టకేలకు సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్.. బిలియనీర్ ఎలన్మస్క్ సొంతమైంది. దాదాపు ఏడు నెలలుగా కొనసాగిన వివాదానికి గురువారం శుభం కార్డ్ వేశారు ఎలన్మస్క్. ‘బర్డ్ వాజ్ ఫ్రీ’ అని ట్వీట్ చేసిన ఈ బిలియనీర్.. ట్విట్టర్ వేదికగా ప్రజలు సినిమాలు చూడాలని, ట్విట్టర్పై వీడియో గేమ్స్ ఆడుకునేలా చేయాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. సంస్థ అడ్వర్టైజ్మెంట్ పాలసీలోనూ మార్పులు తేనున్నట్లు సంకేతాలిచ్చారు. ట్విట్టర్ను బెస్ట్ అడ్వర్టైజింగ్ వేదికగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గురువారం ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే.
ట్విట్టర్ను డబ్బు సంపాదనకు టేకోవర్ చేయడం లేదని, మానవత్వాన్ని పెంపొందించేందుకు కొనుగోలు చేశానని తెలిపారు. ఎలన్మస్క్. అలా ట్విట్టర్ను టేకోవర్ చేయగానే ఇలా సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నెడ్ సెహగల్, లీగల్ ఎఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెలను తొలగించేశారు. ట్విట్టర్లో ఫేక్ లేదా స్పామ్ అకౌంట్లపై తనతోపాటు ఇన్వెస్టర్లను పరాగ్, మిగతా ఇద్దరు ఎగ్జిక్యూటివ్లు తప్పుదోవ పట్టించారని మస్క్ ఆరోపించారు.
తొలుత ఏప్రిల్ 14న ట్విట్టర్ను 43 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని ప్రతిపాదించారు. షేర్పై 54.20 డాలర్ల చొప్పున 43 బిలియన్ డాలర్లకు వందశాతం స్టాక్స్ టేకోవర్ చేస్తామని ప్రతిపాదించారు. తన ప్రతిపాదనను ట్విట్టర్ ఆమోదించకుంటే, సంస్థలో పెట్టుబడుల విషయమై పునః పరిశీలిస్తానని పేర్కొన్నారు. ట్విట్టర్లో ఎలన్మస్క్కు 9.2 శాతం వాటా ఉన్నట్లు గత ఏప్రిల్ 4న మీడియాలో వార్తలొచ్చాయి. అటుపై తొలుత 43 బిలియన్ల డాలర్ల వద్ద మొదలైన డీల్పై సంప్రదింపులు చివరకు 44 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ప్రస్తుతం ట్విట్టర్లో పని చేస్తున్న 7500 మంది ఉద్యోగుల్లో 75 శాతం మందిని ఇంటికి సాగనంపుతారని ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ ఒక వార్తాకథనం ప్రచురించింది. ఇన్వెస్టర్లతో జరిగిన భేటీలో ఎలన్మస్క్ ఈ ప్రతిపాదన చేశారని ఆ వార్త సారాంశం. కానీ తాను నాలుగింట మూడొంతుల మంది అంటే సుమారు 5,600 మంది సిబ్బందిని తొలగించబోనని ఎలన్మస్క్ హామీ ఇచ్చారు. గురువారం సంస్థ ఉద్యోగులతో ఇష్టాగోష్టిగా కూడా మాట్లాడారు. అయితే, సీఈవో పరాగ్ అగర్వాల్తోపాటు మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను ఉద్వాసన పలికిన నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.